హరీశ్ రావు ‘హరిత’ సిద్ధిపేట: నాలుగు చెట్లను నరికినందుకు భారీ జరిమానా!
హైదరాబాద్: సిద్ధిపేట అంటే మొదట గుర్తుకు వచ్చే పేరు హరీశ్ రావు. ఎందుకంటే ఆయన ఆ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ రికార్డులు సృష్టించారు. అంతేగాక, ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు. అంతేగాక, సిద్దిపేటను హరిత సిద్ధిపేటగా తీర్చిదిద్దారు.

హరిత సిద్ధిపేట
సిద్ధిపేట అభివృద్ధికి మంత్రి హరీశ్ రావు తీసుకున్న చొరవ చెప్పుకోదగినదే. సిద్ధిపేట జిల్లా కేంద్రానికి వెళ్లగానే మనకు పచ్చని చెట్లు దర్శనమిస్తుంటాయి. రోడ్లకు ఇరుపువైపులా ఎంతో ప్రశాంతంగా పచ్చదనం కనిపిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదంతా హరీశ్ రావు చేసిన కృషి వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు.

హరీశ్ రావు కృషి ఎంతో..
హరీశ్ రావు సిద్ధిపేట పట్టణంలో ఎక్కడ చూసిన పచ్చదనం కనిపించేలా చెట్లను పెంచడం కోసం ఎంతో కృషి చేశారు. అంతేగాక, వాటి సంరక్షణలో కూడా ఆయన అంతే చొరవను చూపిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు హరీశ్ రావు.

నాలుగు చెట్లు నరకడంతో..
పర్యావరణ ప్రేమికుడైన హరీశ్ రావు చెట్ల సంరక్షణకు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటున్నారు. తాజాగా సిద్ధిపేటలో ఓ షాపు యజమాన్యం నాలుగు చెట్లను నరికివేసింది. ఎవరూ చూడలేదని అనుకున్నారంతా. అయితే, ఈ విషయం హరీశ్ రావు వద్దకు చేరుకోవడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ షాపు యాజమాన్యం భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి తప్పలేదు.

రూ. 45వేలు జరిమానా
సిద్ధిపేటకు చెందిన కొంత మంది వ్యాపారులు రోడ్ల పక్కన ఉన్న చెట్లను అర్ధరాత్రి తర్వాత ఎవరూ చూడలేదనుకుని నాలుగు చెట్లను నరికివేశారు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో చెట్లను నరికిన దృశ్యాలు నమోదయ్యాయి. నిందితులను పట్టుకున్న అధికారులు మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో హరీశ్ రావు సూచన మేరకు ఆ చెట్లు నరికిన వ్యాపారులకు రూ. 45వేల జరిమానా విధించారు అధికారులు.

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పనే..
శుక్రవారం తెల్లవారుజామున సిద్ధిపేట కొత్త బస్టాండ్ సమీపంలోని నాలుగు చెట్లను ఈ నిందితులు నరికివేసినట్లు అధికారులు గుర్తించారు. శివమ్స్ గార్డెన్ సమీపంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు రోడ్డుపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ కనిపించడం లేదని ఫుట్ పాత్పై ఉన్న చెట్లను నరికివేయించారు. మంత్రి సూచనల మేరకు సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ. 45వేల జరిమానా విధించారు. చెట్ల సంరక్షణపై హరీశ్ రావు తీసుకుంటున్న చొరవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications