అసని తుఫాను ప్రభావం: సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారు వర్ణ రథం; స్థానికంగా ఆసక్తి!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రభావం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతమంతా అలజడిగా మారింది. ఇప్పటికే అక్కడ ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా సముద్రం ఒడ్డుకు ఓ బంగారు వర్ణం మందిరం కొట్టుకు వచ్చిన సంఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో అసని తుఫాను ప్రభావంతో ఈ వింత చోటుచేసుకుంది.
ఒక పక్క పెను తుఫాను కొనసాగుతుంటే సంతబొమ్మాలి సున్నాపల్లి రేవులో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అసని తుఫాను ప్రభావంతో సముద్రంలో ఓ స్వర్ణ వర్ణ మందిరం తేలుతూ ఒడ్డుకు వచ్చింది. సముద్రం ఒడ్డుకు ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం మందిరం కొట్టుకు వచ్చింది. ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణంలో ఉన్న ఈ మందిరం అక్కడ ఉన్న ఒక రథంగా భావిస్తున్నారు. ఈ రథం పై 16- 1- 2022 అని విదేశీ భాషల్లో లిఖించి ఉంది . ఇది మలేషియా థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండొచ్చని కొంతమంది మత్స్యకారులు భావిస్తున్నారు.
ఇంత వరకు గతంలో ఎప్పుడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని, తిత్లీ వంటి అతి భయంకరమైన తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి రధాలు సముద్రంలో కొట్టుకు రాలేదని వారు చెబుతున్నారు. ఇక దీనిని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రథం ఎక్కడినుండి కొట్టుకు వచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది . బంగారు రంగులో ఉన్న విదేశీ రథం తమ తీర ప్రాంతానికి కొట్టుకు రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
#CycloneAsani brought to the shores of #Srikakulam #AndhraPradesh a gold-coloured chariot from some far off waters of possibly a south east Asian country... Stuff from mythological tales and fables? #GoldenChariot @ndtv @ndtvindia #ThangaRatham pic.twitter.com/rD0pu9cXQZ
— Uma Sudhir (@umasudhir) May 11, 2022
ఇదిలా ఉంటే అసని తుఫాను తీవ్ర తుఫాను నుండి తుఫానుగా బలహీనపడింది . ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగం పైకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది, దీంతో మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. యానం, కాకినాడ మీదుగా తుఫాను పయనించే సూచన కనిపిస్తుందని సమాచారం.