వీడియో: కుప్పకూలిన ఇచ్ఛాపురం వంతెన
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వంతెన కుప్పకూలింది. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఇచ్ఛాపురం టౌన్లోకి రాకపోకలు స్తంభించిపోయాయి. బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జి ఇది. ఇచ్ఛాపురం గుండా ప్రవహిస్తోన్న బాహుదా నదిపై 1929లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని నిర్మించింది.
ఇచ్ఛాపురం టౌన్ నుంచి జాతీయ రహదారిని అనుసంధానించే ఏకైక మార్గం ఇదే. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. 75 టన్నుల బరువు ఉన్న గ్రానైట్ను మోసుకెళ్తోన్న భారీ ట్రక్కు ఈ వంతెన మీదుగా వెళ్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాని బరువుకు వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి.

ఆ సమయంలో మరో వాహనం వంతెనపై లేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు. డ్రైవర్, క్లీనర్ను ఆసుపత్రికి తరలించారు. ట్రక్కును వెలికి తీసే పనులను చేపట్టారు. వంతెన సామార్థ్యానికి మించిన బరువు గల వాహనం దీని మీదుగా రాకపోకలు సాగించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
కుప్పకూలిన ఇచ్ఛాపురం వంతెన..!! pic.twitter.com/zTxfiDp9GP
— oneindiatelugu (@oneindiatelugu) May 3, 2023
సాధారణంగా ఈ వంతెన మీదుగా కార్లు, బైకుల మీద స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన కుప్పకూలిన ఘటన ఆ ట్రక్కు తప్ప మరే వాహనం లేదు. దీనితో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఇచ్ఛాపురం మండలానికి మంచినీరు, సాగునీటికి ప్రధాన వనరు బాహుదా నది. దీని పరిధిలో 5,000 హెక్టార్ల మేర ఆయకట్టు ఉంది. సుమారు 15 గ్రామాల రైతులు దీనిపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications