నాన్న లే నాన్నా ...దగ్గరకెళ్ళి, గొంతులో నీళ్ళు పోసి, కరోనాతో ప్రాణాలు పోతున్న తండ్రి కోసం కూతురు ఆక్రందన !!
కరోనా మహమ్మారి మానవసంబంధాలను దూరం చేస్తుంది. రక్త బంధాలను తెంచి పారేస్తోంది. తండ్రికి కొడుకును, కొడుకుకు తండ్రిని, తల్లికి బిడ్డను, బిడ్డకు తల్లిని, భార్యకు భర్తను,ఇలా ఒకటేమిటి ఎన్నో అనుబంధాలను దూరం చేస్తుంది. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాలలో కల్లోలం సృష్టిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.ఆసుపత్రులలో వైద్య సదుపాయాల లేమి,ఆక్సిజన్ కొరత, బెడ్లు దొరక్కపోవడం వంటి అనేక కారణాలు, వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే అధికారిక లెక్కల ప్రకారం 45 వేల మంది మరణించారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం అవుతుంది.
కళ్ళముందే తమ వాళ్ళు కడతేరిపోతున్నా నిస్సహాయంగా చూస్తున్న పరిస్థితి
కళ్లముందే తమవారు కడతేరిపోతుంటే, చూస్తూ తట్టుకోలేక,కరోనా మహమ్మారి కారణంగా వారి దగ్గరకు కూడా వెళ్లలేని దయనీయమైన స్థితిలో ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, నిత్యం వేల సంఖ్యలో చోటుచేసుకుంటున్న మరణాలు ఎన్నో వేల కుటుంబాల కన్నీటికి కారణమవుతుంది.కరోనా కారణంగా కళ్ళముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని తీసుకు వచ్చింది.అయ్యో పాపం అని లోలోపల బాధపడడం తప్ప, వెళ్లి సహాయపడలేని పరిస్థితులు ప్రజల మనసులను కలచివేస్తున్నాయి.
కరోనాతో చివరి దశలో కొట్టుమిట్టాడుతున్న తండ్రి కోసం కూతురు ఆక్రందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రులకు వెళ్లలేక, వైద్యం అందక సామాన్య ప్రజానీకం కడతేరి పోతున్నారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో జగన్నాథ వలస పంచాయతీ కొయ్యాన పేటకు చెందిన అసిరి నాయుడు అనే వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే, తండ్రి పడుతున్న వేదన చూసిన కూతురు, కరోనాను సైతం లెక్కచేయకుండా తండ్రి దగ్గరకు వెళ్ళి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది.అయినా తండ్రిని కాపాడుకోలేక పోయింది.
కళ్ళ ముందే కన్నతండ్రి కడతేరిపోతుంటే నిస్సహాయంగా రోదన
కళ్ళముందే కన్నతండ్రి కడతేరి పోతుంటే ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ పరిస్థితిలో ఆ కూతురు ఆక్రందన చూపరులను కంటతడి పెట్టించింది. అసిరి నాయుడు విజయవాడలో కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. భార్యా, ఇద్దరు పిల్లలతో ఉన్నంతలో బ్రతుకుతున్న అతని కుటుంబంపై కరోనా కాటేసింది. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షల లో వారికి కరోనా పాజిటివ్ గా తేలడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు వారిని ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉండాలని సూచించారు. అయితే రోజులు గడిచిన కొద్దీ అసిరి నాయుడు ఆరోగ్యం క్షీణించింది .
నిస్సహాయంగా చూస్తూ నిలుచున్న జనం , తండ్రిని పట్టుకుని, గొంతులో గుక్కెడు నీళ్ళు పోసిన కూతురు
బయటకు వచ్చిన అసిరి నాయుడు క్రిందపడి ప్రాణాల కోసం తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో అక్కడ ఊరి జనం నిస్సహాయంగా చూశారే తప్ప ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అది చూసిన కుమార్తె తన తండ్రి కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నా సరే, తల్లి వారిస్తున్నా వినకుండా తండ్రి దగ్గరకు వెళ్లి పట్టుకుని కాపాడే ప్రయత్నం చేసింది. గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. నాన్న లే నాన్నా అంటూ ఆక్రోశించింది . అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
హృదయవిదారక దృశ్యం .. నిత్యం ఇలాంటి ఘటనలెన్నో .. సామాన్యులకే పెద్ద కష్టం
కరోనా మహమ్మారి ఓ బిడ్డకు తండ్రిని కబళించింది. తండ్రికి కరోనా వచ్చినా భయపడి దూరంగా పారిపోకుండా,ఆ కూతురు తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం హృదయవిదారకం. ఇప్పటికి మారుమూల ప్రాంతాలలో వైద్య వసతులు లేక, కరోనా మహమ్మారి దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న ఇలాంటి బడుగు జీవులు ఎందరో.. అమ్మా,నాన్నలను కోల్పోతున్నఇలాంటి అభాగ్యులు ఎందరో.. నిజంగా కరోనా కారణంగా వణికిపోతున్న సమాజంలో ఎక్కువగా నష్టపోతున్నావారు సామాన్యులే అన్నది కఠోర సత్యం. ప్రజల ప్రాణాల రక్షణ కోసం అన్ని వసతులు కల్పించామని చెప్తున్న పాలకులు ఇలాంటి ఘటనలకు సమాధానం ఏమని చెప్తారు ?