వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాటలకు స్టెప్పులతో ఇరగదీసిన తహసీల్దార్.. వీడియో వైరల్
ఒక పక్క రెవెన్యూ అధికారులపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుండగా ఏపీలో మరో తహసీల్దార్ చేసిన పని అందరికీ విస్మయం కలిగిస్తుంది. శ్రీకాకుళం జిల్లా భామిని తహసీల్దార్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. అసలింతకీ భామిని తహసీల్దార్ ఎస్. నరసింహమూర్తి చేసిన ఘనకార్యం ఏంటి అంటే..
కార్తీక మాసం సందర్భంగా నేరడి బ్యారేజి వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ కార్యక్రమానికి భామిని తహసీల్దార్ ఎస్. నరసింహమూర్తితో పాటు ఇతర రెవిన్యూ సిబ్బంది సైతం హాజరయ్యారు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత అది వైసీపీ కార్యకర్తల వనసమారాధన కాబట్టి వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలను ప్లే చేసారు. ఇక ఆ పాటలకు భామిని తహసీల్దార్ ఎస్. నరసింహమూర్తి చాలా ఉత్సాహంగా స్టెప్పులేశారు. కార్యకర్తలతో కలిసి హంగామా చేశారు.
తాను తహసీల్దార్ ను అన్న విషయం మరచిపోయిన ఆయన డాన్స్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన పాటలకు తన స్టెప్పులతో ఇరగదీశారు తహసీల్దార్ నరసింహమూర్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చ జరుగుతోంది. తహసీల్దార్ కు లేని తలనొప్పి వచ్చి పడింది.