తెలంగాణలో ఆ నియోజకవర్గంలో గెలుపుకోసం 100కోట్లు..
తెలంగాణలో 119 నియోజక వర్గాలు ఉండగా ఆ నియోజక వర్గం పైనే ఆమాత్యులు ఎందుకు కన్నేసారు..? ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే బలం-బలహీనతలమీదే ముఖ్యమంత్రి ఎందుకు ద్రుష్టి కేంద్రీకరించారు..? ఆ నియోజక వర్గంలోని ప్రజానికాన్ని ఎందుకు తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు..? స్థానికేతరుడికి సీటు కేటాయించి ఆ సిట్టింగ్ ఎమ్కెల్యేను ఓడించాలని ఎందుకు పట్టుదలగా ఉన్నారు..? 100కోట్ల రూపాయలను ఆ ఒక్క నియోజక వర్గానికి కేటాయించి అక్కడి ఎమ్మెల్యేని తరిమికొట్టాలని ముఖ్యమంత్రి ఎందుకు పంతం పట్టారు..? ఇంతకి ఎవరా ఎమ్మెల్యే..? ఏదా నియోజకవర్గం..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నకొడంగల్ నియోజకవర్గం.. ఎందుకంత పట్టుదల..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్ ఏమిటి ? కొడంగల్ లో రేవంత్ రెడ్డి మీద గురునాథరెడ్డి వారసులను బరిలోకి దిపింతే ఎలా ఉంటుంది ? అలా కాకుండా స్థానికేతరుడిని రంగంలోకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది..? రేవంత్ రెడ్డిని బలహీన పరిచే అంశాలేమిటి ? ఇవన్నీ అదికార పార్టీ నాయకులు తమలో తాము వేసుకుంటున్నట్టు ప్రశ్నలని సమాచారం ! రేవంత్ రెడ్డి పొజిషన్ ఏమిటో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించుకున్న సర్వేలోని ప్రశ్నల జాబితా ఇది. దీనితో పాటు ఇంకా చాలా అంశాల పై ఈ సర్వేతో సమాచారం సేకరించినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డిని ఓడించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? నియోజకవర్గంలో ఆయనకు బలమైన నాయకగణం ఎవరు? ఆయన వద్ద నుంచి ఎవరిని దూరం చేస్తే బాగా బలహీనపడతాడు లాంటి అంశాలపై ఈ సర్వేతో ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నట్టు తెలిసింది. గత నెలలో ఈ మేరకు ముఖ్యమంత్రి ఓ సర్వే చేయించినట్టు తెలిసింది.
ఏ క్షణం ఎన్నికలు వచ్చినా రేవంత్ గెలుపు ఖాయమంటున్న సర్వేలు..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అన్నది సర్వేలో తేలిన సారాంశంగా విశ్వసనీయవర్గాలు చెప్పాయి. కనీసం 15 నుంచి 20 వేల మధ్య రేవంత్ రెడ్డికి మెజారిటీ కూడా ఖాయమని సీఎం చేయించుకున్న సర్వేలోనే స్పష్టమైందంటున్నారు. ఈ సర్వే చూశాక... రేవంత్ రెడ్డి ఓటమి కంటే, ఆయన మెజారిటీని భారీగా తగ్గించడం పైనే వ్యూహరచన చేయాలని అధికారపక్షం యోచిస్తోందట. ఏం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చే మెజారిటీ భారీగా తగ్గించవచ్చు అన్నదానిపై లెక్కలు కడుతోందట. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. దీంతో కొడంగల్ కు ఉప ఎన్నిక తప్పదని అందరూ భావించారు. అధికారపక్షంతో పాటు రేవంత్ రెడ్డి కూడా అందుకు సిద్ధమయ్యారు. కాగా రేవంత్ రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ కు పంపలేదు. దీంతో ఉప ఎన్నికల అంశం అక్కడితో ఆగిపోయింది. ఆ సందర్భలోనే కొడంగల్ లో ఆపరేషన్ ఆకర్ష్ కు అధికారపక్షం శ్రీకారం చుట్టింది.
రేవంత్ రెడ్డి బలం, బలహీనతలపై అదికార పార్టీ ఆరా.. రంగంలోకి హరీష్..
కొడంగల్ లో అదికార పార్టీ గెలుపు సాద్యాసాద్యాలపై అద్యయనం చేసే బాద్యతలను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి గట్టి మద్ధతుగా ఉంటారనుకున్న చాలా మంది నాయకులను నయానో భయానో టీఆర్ఎస్ వలవేసింది. ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి పనైపోయిందని అంతా భావించారు. రేవంత్ చాలా బలహీనపడిపోయారని... ఎన్నికలంటూ వస్తే ఓటమి ఖాయమని భావించారు. కానీ, తాజా సర్వేతో అధికారపక్షానికి మైండ్ బ్లాంక్ అయినట్టు తెలుస్తోంది. ఎంతలా ప్రయత్నించినా రేవంత్ రెడ్డిని బలహీనపరచలేకపోవడం పై టీఆర్ఎస్ లో ఓ మోస్తరు మేథోమథనమే జరుగుతోందట. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా రేవంత్ రెడ్డి బలాన్ని బాగా తగ్గించాలన్న లెక్కతో అధికార పక్షం పథక రచన చేస్తోందని చెబుతున్నారు. గురునాథ్ రెడ్డి వారసులను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా ఓ దశలో ఆలోచన చేశారట. అయితే, అది ఏ మాత్రం ఫలితాలు ఇవ్వదన్న విషయం సర్వేలో స్పష్టమైందట. ఇక మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డినే దాదాపుగా టీఆర్ఎస్ తన అభ్యర్థిగా ఖరారు చేసింది.
కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించాలన్నది అదికార పార్టీ లక్ష్యం..
కొడంగల్ లో తన సోదరుడుకి సీటు ఇప్పించుకోవాలన్న కోరికతో అక్కడ టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని మంత్రి మహేందర్ రెడ్డి టార్గెట్ చేశారని చెబుతున్నారు. గురునాథరెడ్డి బలంగా ఉంటే... ఎన్నికల నాటికి తన పెత్తనం నడవదన్న ఉద్దేశంతో మహేందర్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పక్షాన తనకు ఎదురులేకుండా ఉండాలంటే... ముందు గురునాథ్ రెడ్డిని రాజకీయం గా బలహీన పరచాలని మహేందర్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే గురునాథ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెనుక మంత్రి మహేందర్ రెడ్డే ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని, ఆయనను ఓడించడం లేదా మెజారిటీని బాగా తగ్గించాలన్న కసితో సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారట. కొడంగల్ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే అదికార పార్టీకి శ్రుంగభంగమే కాకుండా ఉన్న నేతల్లో చిచ్చు రేగే అవకాశాలు ఉన్నాయని అదికార పార్టీకి తెలిసొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికి తెలంగాణలో ఆ ఒక్క నియోజక వర్గంలో గెలుపే లక్ష్యంగా అదికార పార్టీ పావులు కదుపుతున్నట్టు., అందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.