pranay case: 102 మంది సాక్షుల విచారణ, 1200 పేజీలతో, ప్రణయ్ హత్యకేసులో చార్జిషీట్
కిరాయి రౌడీల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసులో మంగళవారం పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 102 మంది సాక్షులను విచారించి.. 1200 పేజీలతో చార్జీషీట్ రూపొందించారు. ఇందులో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. హత్య కేసులో ఏ1 నిందితుడు, ప్రణయ్ మామ మారుతీరావు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మారుతీరావు పోస్టుమార్టం రిపోర్ట్ను కోర్టుకు పోలీసులు సమర్పించారు.

రెండేళ్ల కింద...
2018 సెప్టెంబర్ 14వ తేదీన.. అమృత జీవితంలో విషాదం నింపింది. అమృత తండ్రి మారుతీరావు ఆదేశాల మేరకు రౌడీలు.. ప్రణయ్ను నడిరోడ్డుపై కత్తులతో కుళ్లబొడిచి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రణయ్ మీద దాడి చేయించింది తన తండ్రి మారుతీరావు అని అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దర్యాప్తును ముమ్మరం చేశారు. దాదాపు 10 నెలలు క్షణ్ణంగా విచారించి చార్జీషీట్ రూపొందించారు.

ఏ-1 మారుతీరావు..
మారుతీరావు ప్రమేయంతోనే హత్య జరిగిందని, అందుకు తగ్గ ఆధారాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. దీంతోపాటు చార్జీషీట్లో సంచలన విషయాలు పేర్కొన్నట్టు సమాచారం. ఏ1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో... మిగతా నిందితులపై మోపిన నేరాభియోగాలను పోలీసులు విచారణలో రుజువు చేయాల్సి ఉంది. దీనికితోడు ఇటీవల మారుతీరావు షెడ్డులో ఒక మృతదేహం లభించింది. అది ఎవరిదీ, ప్రణయ్ హత్యతో సంబంధం ఉందా అనే అంశాలపై కూడా పోలీసులు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

మారుతీరావు బలవన్మరణం
ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే మారుతీరావు హత్య చేసుకోవడానికి కారణం.. పోలీసులు వేధించడమేనని అతని భార్య గిరిజ ఆరోపించారు. దీనికితోడు సోదరుడు శ్రవణ్ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభించలేదు. కానీ కేసు విచారణ సందర్భంగా నిజనిజాలు వెలుగుచూసే అవకాశం మాత్రం ఉంది.


Click it and Unblock the Notifications