షాక్: పుట్టినరోజు వేడుకలంటూ 12ఏళ్ల బాలికకు 35ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి, ఏం జరిగిందంటే?
హైదరాబాద్: ఏ తల్లిదండ్రులైనా ఎప్పుడూ తమ పిల్లల భవిష్యత్ బాగుండాలనే కోరుకుంటారు. తాము కష్టపడినా తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ తల్లిదండ్రులు తమ కూతురు పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారి చర్యకు పేదరికమే కారణమైనప్పటికీ.. వారు చేసిన పని మాత్రం క్షమార్హం కానిదే. ఎందుకంటే.. 12 ఏళ్ల తమ కూతురును 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

మైనర్ బాలికను పుట్టినరోజు వేడుకలని నమ్మించి..
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన
వివరాల్లోకి వెళితే.. ఆ దంపతులది నిరుపేద కుటుంబం. వారికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. కాలానికి అనుగుణంగా సంచార జీవితం గడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ బాలిక అమ్మానాన్నలకు ప్రతి పనిలోనూ సహాయపడేది. ఈ క్రమంలో ఓ రోజు తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి.. 'కొద్ది రోజుల్లో నీ పుట్టినరోజు.. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుందాం' అన్నారు. ఎప్పుడూ లేనిది తన పుట్టినరోజు చేస్తానని చెప్పడం ఆ బాలిక సంతోషం వ్యక్తంచేసింది. చెప్పిననాటి నుంచి వారింట్లో పండగ వాతావరణం మొదలైంది. కొత్త బట్టలు తెస్తున్నారు. ఇంటికెవరెవరో బంధువులు వచ్చి వెళ్తున్నారు. కొత్త చీరలు కూడా తెచ్చారు. ఇదంతా చూసి తన పుట్టినరోజును ఘనంగా చేస్తున్నారేమోనని ఆ బాలిక సంబరపడింది.

బర్త్ డే పేరు చెప్పి బలవంతంగా 12 ఏళ్ల బాలికకు 35ఏళ్ల వ్యక్తితో పెళ్లి
ఇక పుట్టినరోజునాడు తన కోసం కేక్ తెస్తారని ఎదురుచూసిన ఆ బాలికకు నిరాశే మిగిలింది. ఆమెకు చీర కట్టించి పెళ్లి కూతురులా ముస్తాబు చేశారు. ఆ తర్వాత మండపానికి తీసుకెళ్లి ఓ వ్యక్తి పక్కన కూర్చోబెట్టారు. అతడు కూడా పెళ్లి కొడుకులా ముస్తాబై ఉన్నాడు. దీంతో తనకు అప్పుడే పెళ్లి చేస్తున్నారని ఆమెకు అర్థమైంది. అంతేగాక, తనకంటే 22 ఏళ్లకుపైగా వయస్సున్న వ్యక్తితో కావడంతో బాలిక షాకైంది. వెంటనే లేచి తనకు ఈ పెళ్లి వద్దని పెద్దగా కేకలు వేసింది బాలిక. అయినా వినకుండా బాలికకు ఆ వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారు కుటుంబసభ్యులు.

బలవంతంగా పెళ్లి చేయడంతో పారిపోయిన బాలిక
మైనర్ అయిన బాలికకు వివాహం చేయడం చట్ట ప్రకారం నేరమే అయినా.. బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వివాహం చేయడం గమనార్హం. కాగా, బలవంతంగా పెళ్లి చేసిన విషయాన్ని ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామస్థులకు తెలిపింది బాలిక. అనంతరం పెళ్లి ఇష్టం లేదని బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో బాలిక ఉన్న చోటుకు వచ్చి బంధువులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదంతో బంధువుల ఇంటి నుంచి బాలిక వెళ్లిపోయింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications