ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్: ఇద్దరు మృతి
శంషాబాద్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గగన్పహాడ్ లోని సంజీమ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే సజీవదహనం కాగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
సంపులో పడి చిన్నారి మృతి
ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడి పది నెలల చిన్నారి మృతిచెందిన విషాద ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం, లంకాల గ్రామానికి చెందిన అనీల్కుమార్, సంధ్య దంపతులు ఏడాది కిందట ఉపాధి కోసం వచ్చి చింతలబస్తీలో ఉంటున్నారు. వీరికి పది నెలల కుమార్తె అనుప్రియ ఉంది.
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో దంపతులిద్దరు ఇంట్లో పనుల్లో ఉండగా పాప ఆడుకుంటూ ఇంటి ఆవరణలోని ఉన్న సంపు వద్దకు చేరి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. పాపకోసం తల్లిదండ్రులు వెతుకుతూ చివరికి సంపులో పడినట్లు గుర్తించారు.
అప్పటికే చిన్నారి మృతి చెందింది. మాచారం అందుకున్న ఎస్ఐ వీరశేఖర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంతోపాటు స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.