రెండే గదుల్లో 20 మంది.. 38 రోజులుగా నరకం.. ఆదుకోవాలని దండాలు..
లాక్ డౌన్ ఓ కుటుంబానికి అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. శుభకార్యానికి వచ్చి 20 మంది బంధువులు తమ ఇంట్లోనే చిక్కుకుపోవడంతో ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. కేవలం రెండే గదులున్న తమ ఇంట్లో నెల రోజులుగా ఇంతమంది ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. అంతేకాదు,ఇంతమందికి భోజన సదుపాయం కల్పించడం తమవల్ల కావట్లేదంటున్నారు. సికింద్రాబాద్లోని పార్శిగుట్ట ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం తాజాగా మీడియాతో తమ ఆవేదనను వ్యక్తం చేసింది.

38 రోజులుగా..
మార్చి 19న పార్శిగుట్టలోని రామగిరి చంద్రయ్య తన కుమారుడి రిసెప్షన్ నిర్వహించారు. ఇందుకోసం విజయవాడ నుంచి 20 మంది బంధువులు వచ్చారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించడంతో.. ఒక్కరోజే కదా అని ఆగిపోయారు. అదేరోజు రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక బయటపడే మార్గం లేకుండా పోయింది. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి.. అంటే దాదాపు 38 రోజులుగా వీరంతా హైదరాబాద్లోనే చిక్కుకుపోయారు.

రెండే గదులున్న ఇంట్లో..
రామచంద్రయ్య ఓ సాధారణ టైలర్. ఉన్నంతలో కొడుకు రిసెప్షన్ బాగానే జరిపించాడు. కానీ పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే చిక్కుకుపోవడం ఆయనకు తలకుమించిన భారంగా మారింది. కేవలం రెండే గదులున్న ఆ అద్దె ఇంట్లో ఇంతమంది ఉండటం కష్టంగా ఉందని వాపోతున్నారు. ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న సహాయ,సహకారాలేవి తమకు అందడం లేదంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం కోసం ప్రయత్నించినప్పటికీ తమను పట్టించుకున్నవారే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఒకసారి విజయవాడ వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు తమను చెక్ పోస్ట్ దాటనివ్వలేదన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని అనుమతించకపోవడంతో.. చేసేది లేక మళ్లీ ఇక్కడికే వచ్చామన్నారు.
Recommended Video

దారి చూపించాలని విజ్ఞప్తి..
తమలో కొందరు పిల్లలను విజయవాడలోనే వదిలేసి వచ్చారని.. ఇప్పుడు వారు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు తమ ఆవేదనను అర్థం చేసుకుని తమకేదైనా మార్గం చూపించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ చూద్దాం.. చేద్దాం.. అనేవారే తప్ప ఎవరూ ఆదుకోవడం లేదన్నారు. స్థానికులు,చుట్టుపక్కలవాళ్లు తినడానికి సాయం చేస్తున్నారని తెలిపారు. ఏం చేసైనా సరే.. తమను తమ ఇళ్లకు చేరేలా చేస్తే అంతకుమించిన సాయం లేదని ధీనంగా దండం పెడుతున్నారు.












Click it and Unblock the Notifications