రేవంత్ దెబ్బ: టిడిపికి అచ్చిరాని 2017, వ్యూహత్మక తప్పిదాలు
హైదరాబాద్: 2017 సంవత్సరం టిడిపికి చాలా చేదు అనుభవాన్ని తెచ్చి పెట్టింది. ఈ ఏడాదిలో టిడిపి తీవ్రంగా నష్టపోయింది. టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహ సుమారు 16 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ ఎపిసోడ్ టిడిపిని రాజకీయంగా మరింత దెబ్బతీసింది. తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్థకమనే పరిస్థితికి చేరుకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం టిడిపిని రాజకీయంగా తీవ్రంగా నష్టపర్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం సాగిన ఉద్యమంలో ప్రత్యేకించి టిడిపి లక్ష్యంగా సాగింది. ఉద్యమం సాగే సమయంలోనే కీలక నేతలు పార్టీని వీడారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు టిడిపి అడ్డు పడుతోందని ఆనాడు టిఆర్ఎస్ చేసిన ప్రచారం టిడిపిని తెలంగాణలో రాజకీయంగా తీవ్రంగా నష్టపర్చింది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టిడిపి సఫలం కాలేదు.

టిడిపికి వరుస దెబ్బలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిడిపికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. టిడిపి నాయకత్వం అనుసరించిన విధానాలు కూడ రాజకీయంగా ఆ పార్టీని నష్టపర్చాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.2014 ఎన్నికల సమయంలో కూడ టిడిపి, బిజెపిలు తెలంగాణలో ఉమ్మడిగా పోటీ చేశాయి. ఆ సమయంలో కూడ 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకొంది. కానీ, ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు తెలంగాణలో టిడిపి రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాయి. టిడిపి నుండి విజయం సాధించిన 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే టిడిపిలో కొనసాగుతున్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కూడ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.

రేవంత్ రెడ్డి ఎపిసోడ్ టిడిపికి పెద్ద షాక్
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన రేవంత్ రెడ్డి పార్టీని వీడడం ఆ పార్టీకి తీవ్రమైన నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.రేవంత్ రెడ్డి తనతో పాటు సుమారు 16 మంది కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు.తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటివరకు వీరంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు ధీటైన ప్రత్యర్థులుగా నిలిచారు. అయితే రేవంత్ రెడ్డి టిడిపిని వీడడం ఆ పార్టీ వర్గాలను షాక్ కు గురి చేసింది. అయితే రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కొందరు టిడిపి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

సీఎం లక్ష్యంగానే రేవంత్ రెడ్డి ప్లాన్
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది రేవంత్ రెడ్డి తన అంతిమ లక్ష్యంగా చెబుతుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొన్న పరిణామాలు రాజకీయంగా టిడిపికి అనుకూలంగా లేవు. భవిష్యత్ కూడ ఆశించినంత అనుకూలంగా లేదనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి భావించారని విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపిలో చేరడం వల్ల కూడ ప్రయోజనం ఉండదని భావించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

టిఆర్ఎస్తో పొత్తుపై
2019 ఎన్నికల్లో తెలంగాణటో టిడిపి టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉందని తెలంగాణ టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహ్ములు ప్రకటించారు. అయితే టిఆర్ఎస్తో టిడిపి పొత్తును రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. ఈ కారణాన్ని చూపి రేవంత్ రెడ్డి పార్టీ మారారు. మరో వైపు ఏపీకి చెందిన టిడిపి నేతలు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం వద్ద కాంట్రాక్టులు చేస్తున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు చేసుకొంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పొత్తులపై ఎవరూ మాట్లాడకూడదని బాబు సూచించారు. ఆ తర్వాత రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వ్యూహత్మక తప్పిదాలు
2014 ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, బిజెపితో పొత్తు విషయం నుండి టిడిపి నాయకత్వం వ్యవహరించిన తీరు రాజకీయంగా ఆ పార్టీని తీవ్రంగా నష్టపరిచింది. ఎన్నికల సమయంలో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు కొందరు నేతలు పార్టీ మారడానికి కారణమైంది. ఎన్నికల తర్వాత కూడ చోటు చేసుకొన్న పరిణామాల్లో కూడ అదే తరహ విధానాలను అనుసరించడం కూడ పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గించింది. మరో వైపు చంద్రబాబునాయుడు ఏపీ రాజకీయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం కూడ టిడిపికి తెలంగాణలో రాజకీయంగా ఇబ్బందులు కల్గించింది.












Click it and Unblock the Notifications