హైద్రాబాద్ టాప్ :30 ఏళ్ళు దాటినా పెళ్ళికి దూరంగా మహిళలు, కేరీర్ కోసమేనా?
కేరీర్ కోసం ముప్పై ఏళ్ళు దాటినా వివాహం చేసుకొనేందుకు యువతులు సిద్దపడడం లేదు. వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న మహిళలు అత్యధికంగా హైద్రాబాద్ లోనే ఉంటున్నారని సర్వే చెబుతోంది.
హైదరాబాద్: 30 ఏళ్ళు దాటినా కాని వివాహం చేసుకొనేందుకు యువతులు సిద్దంగా లేరు. ముప్పై ఏళ్ళు దాటినా వివాహం చేసుకోకుండా ఒంటరిగా నివసిస్తోన్న వారు అత్యధికంగా హైద్రాబాద్ లోనే ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళలకు ప్రతి నెలా పెన్షన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకొంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు.
ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారనే విషయమై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో షాక్ కు గురయ్యే వాస్తవాలు వెలుగు చూశాయి.
జీవితంలో స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకొనేందుకుగాను తెలంగాణలో ఎక్కువమంది యువతులు ఆసక్తిని చూపుతున్నారని ఈ సర్వే నివేదిక తెలుపుతోంది.
హైద్రాబాద్ లోనే ఎక్కువగా ఒంటరి మహిళలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరి మహిళల సంఖ్యను తేల్చేందుకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 36,659 ఒంటరి మహిళలు హైద్రాబాద్ లోనే ఉన్నారని ఈ సర్వే తేల్చిచెప్పింది. పట్టణ ప్రాంతంలోనే ఎక్కువగా ఒంటరి మహిళలు ఉంటున్నారని ఈ సర్వేలో లెక్కలు చెబుతున్నాయి. హైద్రాబాద్ లోనే ఎక్కువగా వివాహం కాని మహిళలు ఉన్నారని ఈ సర్వేలో తేలింది.
హైద్రాబాద్ చుట్టు జిల్లాల్లోనే అవివాహిత మహిళలు
వివాహం కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలు ఎక్కువగా హైద్రాబాద్ లో ఉంటే, హైద్రాబాద్ తర్వాత స్థానాల్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు జిల్లాలు కూడ హైద్రాబాద్ చుట్టూ ఉన్నాయి. పట్టణ ప్రాంత జిల్లాల్లో ఎక్కువగా మహిళలు కేరీర్ కోసం ప్రాధాన్యతను ఇస్తున్నాయి.దరిమిలా వివాహనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేరీర్ కోసం పెళ్ళికి దూరంగా యువతులు
పెళ్ళి కంటే ముందుగానే కేరీర్ కోసమే యువతులు కేంద్రీకరిస్తున్నారు. అందుకే వివాహం చేసుకోకుండానే ముప్పై ఏళ్ళు దాటినా ఒంటరిగానే నివసిస్తున్నారు.కేరీర్ కోసమే వివాహనికి దూరంగా ఉంటున్నట్టుగా యువతులు సర్వే సందర్భంగా చెప్పారని అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి నెలాఖరువరకు సర్వే
ఈ నెలాఖరువరకు ఒంటరి మహిళల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సోసైటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు, పెళ్ళి కన్నా కెరీర్ విషయంలో ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్టు ఈ సర్వే నివేదిక చెబుతోంది.దీనికితోడుగా వరకట్నం, ఆరోగ్యసమస్యలు ,కుటుంబసమస్యల కారణంగా కూడ మహిళలు వివాహనికి దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒంటరి మహిళలు సిద్దిపేట జిల్లాలో తక్కువే
వివాహనికి దూరంగా ఉన్న మహిళలు అత్యధికంగా హైద్రాబాద్ లో ఉంటే, అతి తక్కువగా సిద్దిపేట జిల్లాలో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 2,337 మంది ఉన్నారు. హైద్రాబాద్ లో అత్యధికంగా 36,659 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్ లో 16,112మంది, రంగారెడ్డి జిల్లాలో 12,127 మంది ఉన్నారు. మహబూబ్ నగర్ లో5,154, నిజామాబాద్ లో5,141,వరంగల్ అర్బన్ లో4,773మంది, సంగారెడ్డిలో4,336 మంది, నాగర్ కర్నూల్ లో 3,992, నల్గొండలో, యాదాద్రిలో 3,950, కరీంనగర్ లో 3,396, జగిత్యాలలో2,746, పెద్దపల్లిలో2,501,కామారెడ్డిలో2,476,మంచిర్యాలలో2,465,ఆదిలాబాద్ లో2,412 మంది ఉన్నారని ఈ సర్వే నివేదిక చెబుతోంది.