తెలంగాణలో కరోనా పంజా: 40 మందికి పాజిటివ్, 13 మంది డిశ్చార్జ్, 461 మందికి ట్రీట్ మెంట్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్కి తగ్గడం లేదు. గత 24 గంటల్లో కూడా మరో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 31, ఆదివారం 33, సోమవారం 79, మంగళవారం 51, బుధవారం 41, గురువారం 47 కాగా.. శుక్రవారం 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా.. ఏడుగురు వలసకూలీలకు వైరస్ సోకింది. 40 కేసులతో సహా మొత్తం కేసులు సంఖ్య 1454కి చేరింది.
వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 34గా ఉంది. చికిత్స తర్వాత శుక్రవారం 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న మొత్తం సంఖ్య 959కి చేరింది. ప్రస్తుతం 461 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదు.
గత 14 రోజుల నుంచి కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ బులెటిన్లో అధికారులు పేర్కొన్నారు.