మంచం పట్టిన దుబ్బాక గురుకులం విద్యార్థులు; 40మందికి తీవ్ర అస్వస్థత; కారణం అదేనా!!
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మిరుదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు తీవ్ర జ్వరం, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా వైద్యబృందం ఆధ్వర్యంలో చికిత్స చేస్తున్నారు. పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు.
మిరుదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 40మంది విద్యార్థులకు అస్వస్థత
సీజనల్ వ్యాధులు ప్రబలడంతో హాస్టల్లోని విద్యార్థులు జ్వరం, జలుబు, కడుపునొప్పితో బాధపడుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి . దీంతో హాస్టల్ లోని 60 మందికి వైద్య బృందం పరీక్షలు నిర్వహించి, 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా గుర్తించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో 12 మందిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారందరినీ గురుకుల పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ వదంతులు .. విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల ఆందోళన
హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న వదంతులు వ్యాపించడంతో స్థానిక నాయకులు పాఠశాలకు చేరుకుని ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. పరిశుభ్రమైన ఆహారం, వసతులు లేకపోవడంతో హాస్టల్ లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక విద్యార్థులు సైతం తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
సరైన సౌకర్యాలు కల్పించాలని వారు చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. అయితే వారంతా సీజనల్ జ్వరంతో బాధ పడుతున్నారని స్కూల్ నిర్వాహకులు అంటున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో విపరీతంగా నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న మొత్తం 236 మంది విద్యార్థులు గత 26 రోజుల్లో కలుషిత ఆహారం మరియు కలుషితమైన నీటి కారణంగా ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ సభ్యులు సేకరించిన సమాచారం ప్రకారం గత నెలలో తొమ్మిది జిల్లాల్లోని 10 చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.
గత ఎనిమిది నెలల్లో 17 జిల్లాల్లోని 25 చోట్ల వివిధ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు హాస్టళ్లలో కలుషిత ఆహారం మరియు నీటి కారణంగా మొత్తం 936 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని డేటా పేర్కొంది.