తెలంగాణలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: అన్నీ హైదరాబాద్లోనే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1634కు చేరింది.
ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
జీహెచ్ఎంసీ పరిధిలో 34 కేసులు నమోదవగా.. మరో 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వలస కూలీల సంఖ్య 77కి చేరింది. మంగళవారం కరోనా నుంచి కోలుకుని 9 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1011కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 585 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. అంతేగాక, 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించింది.
ఇక భారతదేశంలో 1,03,886 కరోనా కేసులు నమోదు కాగా, 3212 మంది మరణించారు. 59,812 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. 40,856 మంది కోలుకున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 4,895,033 మంది ప్రజలు కరోనా బారినపడ్డారు. 320,192 మంది మరణించారు. 1,909,433 మంది కరోనా నుంచి కోలుకున్నారు.