కరోనా అప్డేట్... తెలంగాణలో కొత్తగా 461 కేసులు.. మరో ముగ్గురు మృతి...
తెలంగాణలో కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 763 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం (జనవరి 1) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,815కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1544కి చేరింది. ప్రస్తుతం 5815 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 3674 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 617 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,79,456కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 42,013 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 69,24,707కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,86,048 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.1 శాతం ఉండగా తెలంగాణలో 97.43శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 108,రంగారెడ్డిలో 44,మేడ్చల్ మల్కాజ్గిరిలో 41 కేసులు నమోదయ్యాయి.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,036 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 256 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు చేరగా... మృతుల సంఖ్య 1,48,994కు చేరింది. గత 24గంటల్లో మరో 23,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు.మొత్తంగా 98,83,461 మంది ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న(డిసెంబర్ 31) మొత్తం 10,62,420 శాంపిళ్లను పరీక్షించగా... ఇప్పటివరకూ మొత్తం 17,31,11,694 కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.