మెడికల్ సీట్ ఇప్పిస్తానని 48లక్షలు తీసుకుని మోసం.. బీజేపీ నేత అరెస్ట్!!
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఓ చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. నీట్ రాసిన ఒక విద్యార్థినికి మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుండి రూ.48.53 లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ నాయకుడు కొత్తపల్లి సతీష్ కుమార్ను హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
మెడికల్ సీటు ఇప్పిస్తానని మోసం చేసిన బీజేపీ నేత
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్లోని కమలానగర్కు చెందిన సతీష్కుమార్ బాచుపల్లిలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.48.53 లక్షలు వసూలు చేశాడు. అయితే, తన కుమార్తెకు మెడికల్ సీటు వస్తుందని నమ్మి డబ్బులు ఇచ్చిన వ్యక్తి, తన కుమార్తెకు మెడికల్ సీటు విషయంలో సతీష్ ను నిలదీశారు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు తమ డబ్బును తిరిగి ఇవ్వమని అడగడంతో, సతీష్ అలాట్మెంట్ ఆర్డర్ను ఫోర్జరీ చేసి వారికి ఇచ్చాడు. అంతేకాదు వారిని నమ్మించడం కోసం వారికి రెండు చెక్కులను కూడా ఇచ్చాడు.
పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం.. బీజేపీ నేత అరెస్ట్
మెడికల్ సీట్ రాకపోవడంతో బాధిత కుటుంబం తమ డబ్బులు అయినా తిరిగి వస్తాయేమో అని సతీష్ కుమార్ ఇచ్చిన చెక్కులను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్ కావడంతో, మోసపోయామని గుర్తించిన బాధిత కుటుంబం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి బిజెపి నాయకుడు సతీష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. సతీష్ ను కోర్టులో సీసీఎస్ పోలీసులు హాజరుపరిచారు.
గతంలో జనగామ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ కుమార్
ఇదిలా ఉంటే సతీష్ కుమార్ 2018లో జనగామ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి సతీష్ కుమార్ బిజెపి పార్టీలోనే కొనసాగుతున్నారు. తాజాగా సతీష్ కుమార్ చీటింగ్ కేసు వ్యవహారం జనగామ జిల్లాలో బిజెపి నాయకులలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నుండి కూడా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.