లారీ చక్రాల కింద నలిగిపోయిన చిన్నారి: మిన్నంటిన రోదనలు
హైదరాబాద్: లారీ చక్రాల కింద ఓ చిన్నారి నలిగిపోయింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలిక అర్థాంతరంగా తనువు చాలించింది. దాంతో తల్లిదండ్రులు, బంధువులో నడిరోడ్డుపై చిన్నారి మృతదేహంో ఆందోళన చేపట్టారు. వారి రోదనలు మిన్నంటాయి.
ఈ ప్రమాదం హైదరాబాదు సమీపంలోని హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వెంకటేష్, రాములమ్మ దంపతులు హయత్నగర్ మండలం బండరావిరాల గ్రామ సమీపంలోని ఓ క్రషర్ వద్ద నివసిస్తూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. పెద్ద కూతురు శిరీష(5)ను ఈ మధ్యే బడిలో చేర్పించారు.
వారం క్రితం తాత, నాయనమ్మతో కలిసి కడపలోని మేనత్త ఇంటికి వెళ్లిన శిరీష తిరిగి గురువారం చేరుకుంది. తాత, నాయనమ్మతో మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఆటో దిగి రోడ్డుపై వెళుతుండగా బండరావిరాల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ అతివేగంగా వస్తూ శిరీషను ఢీకొట్టాడు.
లారీ చక్రాలు శిరీషపై నుంచి వెళ్లడంతో చిన్నారి శరీరం పూర్తిగా చిధ్రమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. శిరీష మృతితో తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని గుండెలు పగిలెలా కన్నీరు మన్నీరయ్యారు. మృతికి కారణమైన లారీ డ్రైవర్ను, అసంపూర్తిగా రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని మృతిరాలి బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న సీఐ నరేందర్గౌడ్, ఎస్సై శీను సంఘటన స్థలాన్ని చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.