రెయిన్ బో ఆస్పత్రిలో దారుణం.. వైద్యం పేరుతో 60లక్షల బిల్లు; అయినా నిలవని పసిప్రాణాలు
వైద్యో నారాయణో హరి అంటారు... అంటే వైద్యుడు దైవంతో సమానమని అర్థం. ప్రజల ప్రాణాలను కాపాడే ఆసుపత్రులు దేవాలయాలు అని భావించే రోజులు పోయి, ఆసుపత్రులు వ్యాపార కేంద్రాలుగా మారిన పరిస్థితులు ప్రస్తుతం చూస్తున్నాం. కొందరు వైద్యులు డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని, ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. టెస్టుల పేరుతో, ట్రీట్మెంట్ పేరుతో అందినకాడికి దండుకోవడం చాలా ప్రైవేటు ఆసుపత్రులలో నిత్యకృత్యంగా మారింది. తాజాగా హైదరాబాద్లోని రెయిన్ బో ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన ప్రైవేట్ ఆసుపత్రుల తీరుకు అద్దం పడుతుంది.
బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రఘునాథ్ రెడ్డి, సువర్ణ దంపతులు హైదరాబాద్ నగరంలో నివాసముంటున్నారు. గర్భవతిగా ఉన్న సువర్ణను ప్రసవ సమయం దగ్గర పడటంతో ఏప్రిల్ 24వ తేదీన బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేర్చిన 12 రోజుల తర్వాత సువర్ణ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప పుట్టిన సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. అయితే పుట్టిన మూడవ రోజు డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక నవజాత శిశువు మృతి చెందింది.
Recommended Video
కవల పిల్లలు కావడంతో వారిద్దరినీ కాపాడడం కోసం చికిత్స చేస్తామని చెప్పిన డాక్టర్లు పాప చికిత్సకు 19 లక్షల 90 వేలు బిల్లు వేశారు. అయినా పుట్టిన మూడవ రోజు పాప మృత్యువాత పడింది. ఆ తర్వాత బాబునైనా కాపాడుకోవాలని ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కన్నీరే మిగిలింది. చిన్నారి బాబు చికిత్సకు 33 లక్షల 16 వేల బిల్లు వేసిన ఆసుపత్రి యాజమాన్యం బాబును కాపాడలేకపోయింది. చికిత్స పొందుతూ బాబు బుధవారం నాడు మృతిచెందాడు.
ఇక రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు చికిత్స పేరుతో ఇప్పటివరకూ 60 లక్షలకు పైగా వసూలు చేశారని, అయినా తమ పిల్లలను కాపాడలేకపోయారు అని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇప్పటివరకు ఆసుపత్రికి 60 లక్షలకు పైగా చెల్లించామని అంటున్న బాధితులు, ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సంతానాన్ని కోల్పోయామని వాపోతున్నారు. రెయిన్ బో ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.