తెలంగాణలో స్వల్పంగా కేసుల పెరుగుదల 1016కి చేరిక: విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. బుధవారం కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన డిపాజిట్ కేసుల సంఖ్య 1016కు చేరింది.
కాగా, రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 25 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 409కి చేరింది.
విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం
కరోనా కష్ట కాలంలో విద్యుత్ ఉద్యోగులంతా రేయింబవళ్ళు కష్టపడి 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నారని, ఉద్యోగులంతా తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన రూ. 11.4 కోట్ల చెక్కును నాలుగు సంస్థలకు చెందిన సిఎండిలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో జెన్ కో - ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు అందించారు.
వ్యవసాయ రంగంపై కేసీఆర్ కీలక ఆదేశాలు
గత ఐదేళ్ళలో అందుబాటులోకి వచ్చిన 22.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములకు అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గోదాములు నిర్మించాలి. నకిలీ ఎరువులు, పురుగుమందులు, కల్తీ విత్తనాలు అమ్మే వారిని నిఘా విభాగం ఇప్పటికే గుర్తించింది. వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ వర్షాకాలంలో 22.30 లక్షల టన్నుల ఎరువులు కావాల్సి ఉంది. వీటిని సకాలంలో రైతులకు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ లో వాడడానికి అవసరమైన ఎరువులను రైతులు ఒకేసారి గుమికూడకుండా క్రమ పద్ధతిలో మే మాసంలోనే కొనుగోలు చేయాలి. ఈ విషయమై ఎఇవోలు రైతులను సమన్వయ పరచాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
ప్రజలకు అవసరమైన, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వ్యవసాయశాఖ గుర్తించాలి. సాగుకు ఏ ప్రాంతంలో ఏ పంట అనువైనదో నిర్ణయించి, రైతులకు మార్గదర్శనం చేయాలి. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎవరు ఏ పంట వేస్తున్నారో ఖచ్చితంగా రికార్డు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.