చనిపోయి నెల రోజులకు?: హాల్లో మృతదేహాన్ని చూసి షాక్ తిన్న భార్య..
అమెరికా నుంచి వచ్చిన అతని భార్య, కుమార్తె మూర్తి మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు.
హైదరాబాద్: కాస్మోపాలిటన్ కల్చర్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచేసింది. పక్కింట్లో వ్యక్తి చనిపోతే నెల రోజులకు గానీ విషయం బయటకు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్ లోని రాక్టౌన్ ప్రాంతంలో ఉన్న సాయిమారుతీ రెసిడెన్సీలో మూర్తి అనే ఓ 70ఏళ్ల వృద్దుడు చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం అతను చనిపోయినట్లుగా పోలీసులు నిర్దారించారు.

అమెరికా నుంచి అతని భార్య, కుమార్తె హైదరాబాద్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే మూర్తి తన భార్యను అమెరికాలోని కుమార్తె వద్దకు పంపించాడు. నిజానికి మూర్తి కూడా వెళ్లాల్సి ఉన్నా.. దేశం కాని దేశం వెళ్లడం ఇష్టం లేక వెళ్లలేకపోయాడు. ఇండియాలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటుండటంతో మూర్తి కుమార్తె వారిద్దరికి విమాన టికెట్లు కూడా పంపించింది.
కానీ భార్యను మాత్రమే పంపించి తాను మాత్రం రాజమండ్రిలోనే ఉండిపోయాడు. ఇటీవల బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. ఆరోజు రాత్రి ఎల్బీనగర్ లోని సాయిమారుతీ రెసిడెన్సీలో ఉన్న ఫ్లాటుకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ తెలియకుండా పోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. అతని భార్య, కుమార్తెలు ఆందోళన చెందారు.
హైదరాబాద్ చేరుకుని తమ ఫ్లాట్ వద్దకు వెళ్లారు. ఇంటి తలుపు తీయగానే తీవ్ర దుర్వాసనతో హాల్లోనే మూర్తి మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కన ఓ బల్లి చనిపోయి ఉండటాన్ని బట్టి కీలక ఆధారాలు సంపాదించారు.
పొరపాటున బల్లిపై కాలు వేసి జారి పడటంతో.. తలకు బలంగా దెబ్బ తగిలి మూర్తి గాయపడ్డాడని గుర్తించారు. ఆపై అపస్మారక స్థితిలోకి వెళ్లడం.. పట్టించుకునేవారెవరూ లేకపోవడంతో ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications