ఆ 8 కోట్లు మావే : అంగీకరించిన బీజేపీ, నగదు తరలింపుపై కొరవడిన స్పష్టత
హైదరాబాద్ : ఎన్నికల వేళ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8 కోట్ల నగదు తమదేనని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రకటించింది. సరైన సమాచరంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా కోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ నగదు బీజేపీ ఫండ్ అని తొలుత ఊహాగానాలు వినిపించాయి. తర్వాత బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ఆ నగదు తమదేనని తెలిపారు.

రూ.8 కోట్లు స్వాధీనం
హిమాయత్ నగర్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా తొలుత ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి నుంచి రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా .. నారాయణగూడ ఓ బ్యాంకులో మిగతావారు ఉన్నారనే సమాచారంతో అక్కడికెళ్లి మరో రూ.6 కోట్ల నగదు సీజ్ చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ మీడియాకు సమాచారం అందించింది. ఆ నగదు తమదేనని పేర్కొన్నది.

చిల్లర ఖర్చుల కోసమా ?
కానీ నగదు తరలింపుపై మాత్రం స్పష్టత కొరవడింది. కృష్ణసాగర్ మాట్లాడుతూ .. ఆ నగదు తమ పార్టీ చిల్లర ఖర్చుకోసం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయం కోసం గత జనవరి నుంచి కేటాయింపులు నిలిచిపోయాయని తెలిపారు. కానీ పోలీసులు తమ అకౌంటెంట్ గోపిని, మిగతా వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.

నిబంధనలు వర్తించవా ?
రూ.8 కోట్ల నగదు ఒకేసారి పట్టుబడటం కలకలం రేపుతోంది. సాధారణంగా ఎన్నికల నియామవళి ప్రకారం రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు తరలించేందుకు నిబంధనలు అనుమతించవు. ఒకవేళ రూ.2 లక్షలు అంతకన్నా ఎక్కువ నగదు తరలించాలంటే .. ఈసీ రూల్ ప్రకారం సరైన పత్రాలు చూపాల్సి ఉంటుంది. ఆ విధంగా చూపితే, పత్రాలను సరిచూసుకొని పోలీసులు అనుమతిస్తారు. కానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ అకౌంటెంట్ గోపిని .. తన సిబ్బందితో కలిసి రూ.8 కోట్లు ఎలాంటి పత్రాలు లేకుండా అదీ బ్యాంకు నుంచి విత్ డ్రా చేయడం అనుమానాలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications