ఔటర్పై ఘోరం: ఎవరిదీ నిర్లక్ష్యం?, 8 మంది మృతి, 7గురు బీటెక్ విద్యార్ధులే
హైదరాబాద్: నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్ టోల్గేట్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోల్ చెల్లించేందుకు లారీ వెనుక ఆగి ఉన్న టవేరా వాహనాన్ని వేగంగా వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో లారీ, డీసీఎం మధ్య టవేరా నలిగిపోయి నుజ్జునుజ్జు అయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో టవేరాను నడుపుతున్న డ్రైవర్తో సహా 8 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే...

స్నేహితురాలి పెళ్లి విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు
మెదక్ జిల్లా సదాశివ పేటకు చెందిన తొమ్మిది మంది యువకులు స్నేహితురాలి పెళ్లి విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. నగర శివారులోని కొంపల్లి ఏఎంఆర్ గార్డెన్లో జరుగుతున్న ఈ పెళ్లి విందు కార్యక్రమానికి షకావత్(30)కు చెందిన సొంత టవేరా వాహనంలో ప్రయాణమయ్యారు. షకావత్ స్వయంగా వాహనాన్ని నడుపుతున్నాడు. మేడ్చల్, సుతారిగూడ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టోల్ గేటు వద్ద టోల్ చెల్లించేందుకు వీరు తమ వాహనాన్ని నిలిపారు. వీరికి ముందు వీఆర్ఎల్ ట్రాన్స్పోర్టు లారీ నిలిచి ఉంది. టోల్ గేట్ వద్ద టోల్ చెల్లించే క్రమంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాను టవేరా వాహనాన్ని ఢీకొంది.

నుజ్జునుజ్జైన టవేరా
దీంతో టవేరా ముందు ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో లారీ, డీసీఎం మధ్య టవేరా నలిగిపోయి నుజ్జునుజ్జు అయింది. 8 మంది అక్కడికక్కడే దుర్మరణం టవేరాలోని ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ రోడ్డు ప్రమాదంలో అబ్బాస్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీల నడుమ చిక్కుకున్న టవేరాను క్రేన్ సాయంతో బయటకు లాగి అందులోని మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినవారు.

మృతులంతా మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన వారు
మృతులను మహ్మద్ అఖిల్(23), మహ్మద్ ఇమ్రాస్(23), షకావత (30), ఫిరోజ్(23), మహ్మద్ ఇర్ఫాన్(23), మహ్మద్ అక్బర్, మహ్మద్ నిషాద్గా గుర్తించారు. మేడ్చల్ టోల్ గేట్ వద్ద వేగ నియంత్రణకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది. సమాచారమందుకున్న కుటుంబ సభ్యులు టోల్గేట్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాసేపట్లో పెళ్లి విందుకు హాజరవుతారనగా ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి ఇంట పెనువిషాదం నింపింది.

మేడ్చల్ రోడ్డుప్ర మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మెదక్ జిల్లా మేడ్చల్ సుతారిగూడ టోల్గేట్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications