వచ్చే ఏడాదికి తెలంగాణాలో మరో 8 మెడికల్ కాలేజీలు; నీలోఫర్ లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడి
ఇటీవల అదనంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు చేపాట్టక ఆయన తొలి కార్యక్రమం నీలోఫర్ ఆస్పత్రిలో నిర్వహించారు. శనివారం హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ఐసీయూ యూనిట్ ను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ దిశగా అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ఆరోగ్య శాఖ బలోపేతంపై దృష్టి పెట్టామన్న మంత్రి హరీష్ రావు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రులకు 18 కోట్ల రూపాయలు అందించామని స్పష్టం చేశారు. 10 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్యశాఖను మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్న హరీష్ రావు, ఆ దిశగా పని చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని హరీష్ రావు పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్న హరీష్ రావు
వచ్చే ఏడాది నుండి రాష్ట్రంలో మరో 8 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని తెలిపిన ఆయన, తెలంగాణ రాష్ట్రం వైద్య సదుపాయాలపై దృష్టి సారించిందని వెల్లడించారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన కెసిఆర్ కిట్ లతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి కేసీఆర్ సర్కార్ విశేషంగా కృషి చేసిందని డెలివరీల రేటును 50 శాతానికి పెంచింది అని, దీంతో పాటు మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు.
త్వరలో 33 కోట్ల రూపాయలతో 800 పడకల యూనిట్ .. నీలోఫర్ అప్ గ్రేడ్
ఇదే సమయంలో త్వరలో 33 కోట్లతో నిలోఫర్ ఆస్పత్రిలో మరో 800 పడకల యూనిట్ ను అందుబాటులోకి తెస్తామని న్రేలోఫార్ ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కరోనా నివారణ చర్యలు, నియంత్రణ చర్యలపై మాట్లాడిన మంత్రి హరీష్ రావు థర్డ్ వేవ్ వస్తే సన్నద్ధంగా ఉండేందుకు ఇప్పటికే నూట ముప్పై మూడు కోట్ల రూపాయలను కేటాయించామని వెల్లడించారు . అంతేకాదు చిన్న పిల్లల కోసం ఐదువేల పడకలను సిద్ధంగా ఉంచామని వెల్లడించిన హరీష్ రావు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ ముందంజలోనే ఉన్నామని స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్ లోనూ తెలంగాణా ముందంజ
కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో దేశ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అన్ని వైద్య వనరులను అందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వైద్యులు నిబద్ధతతో పని చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
ఇటీవల సీఎం కేసీఆర్ వద్దనుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం చేయడంపై, వైద్య ఆరోగ్య శాఖలో సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించారు. దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. మరి మంత్రి హరీష్ రావ్ చేస్తున్న ప్రయత్నం వైద్య ఆరోగ్య శాఖలో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాల్సిందే.