తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు... నలుగురు మృతి
తెలంగాణలో కొత్తగా 983 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కేసులున్నాయి. రాష్ట్రంలో మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇప్పటివరకూ 247 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో 244 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 5,172 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 9వేల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఈరోజు(జూన్ 28) నమోదైన కేసుల్లో హైదరాబాద్ తర్వాత రంగారెడ్డిలో అత్యధికంగా 47,మంచిర్యాలలో 33,మేడ్చల్లో 29 కేసులు నమోదయ్యాయి.
వరంగల్ రూరల్ జిల్లాలో 19, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, భద్రాద్రిలో 5, నల్గొండ, కరీంనగర్, సిద్దిపేట్, ఖమ్మంలో 3, ఆదిలాబాద్, గద్వాలలో 2, సంగారెడ్డి, మహబూబ్నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోకేసు చొప్పున నమోదయ్యాయి.
గత సోమవారం(జూన్ 22) నుంచి ఆదివారం(జూన్ 28) వరకూ నమోదైన కేసులను పరిశీలిస్తే.. ప్రతీరోజూ వెయ్యికి దగ్గరగా కేసులు నమోదయ్యాయి. సోమవారం 872,మంగళవారం 879,బుధవారం 891,గురువారం 920, శుక్రవారం 985, శనివారం 1080,ఆదివారం 983 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.