విషాదం: కిటికీకి ఉరివేసుకుని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. అనుమానస్పద స్థితిలో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం అవుసాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అవుషాపూర్లోని ఎస్పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆనంద్ గౌడ్ అనే విద్యార్ధి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఏమైందో ఏమో గానీ మంగళవారం అర్ధరాత్రి హాస్టల్ క్యాంపస్లోని కిటికీకి తాడు బిగించుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను గమనించిన తోటి విద్యార్ధులు బుధవారం ఉదయం స్కూల్ యాజమాన్యానికి తెలిపారు. దీంతో హుటాహుటిన హాస్టల్కు చేరుకున్న యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆనంద్ గౌడ్ మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నందు తల్లిదండ్రులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలానికి నందు పెదనాన్న చేరుకున్నారు.
హాస్టల్ రెండో అంతస్తులో కిటికీకి ముఖంగా ఆనంద్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు హాస్టల్ మొత్తం వెతికినా సూసైడ్ నోట్ లాంటివి కూడా లభించలేదు. దీంతో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ ఉద్యోగి మృతి
ఎర్రగడ్డలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మృత్యువాతపడ్డాడు. జేఎన్టీయూలోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖలో పనిచేస్తున్న మురళీకృష్ణ బైక్పై వెళ్తుండగా మెట్రోస్టేషన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణ ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మురళీకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యాంకర్ను సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.