భర్తకు ఫోన్ చేసి రాత్రి లేట్గా వస్తానంది: బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
నగరంలో ఓ బ్యూటీషియన్ అనుమానస్పాద స్థితిలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో ఓ బ్యూటీషియన్ అనుమానస్పాద స్థితిలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి(28) అలియాస్ శిరీష ఫిలింనగర్లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యూటీషియన్గా పని చేస్తోంది. అంతేగాక, హెచ్ఆర్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తోంది.
కాగా, సోమవారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో తన భర్త సతీష్ చంద్రకు ఫోన్ చేసిన శిరీష.. రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తానని తెలిపింది. అయితే ఆమె ఆ రాత్రి ఇంటికి రాలేదు. ఎప్పటిలాగే సతీష్ మంగళవారం ఉదయం బేగంపేటలోని తాను కుక్గా పని చేసే ఆశ్రయ్-ఆకృతి పాఠశాలకు వెళ్లారు.
ఆ తర్వాత సతీష్ చంద్రకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్ చేసి వెంటనే శిరీష పనిచేస్తున్న ఫిలింనగర్లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రావాలని చెప్పారు. దీంతో సతీష్ అక్కడి వెళ్లి చూడగా.. శిరీష విగత జీవిగా కనిపించింది. ఆర్జే ఫొటోగ్రఫీ యజమాని వల్లభనేని రాజీవ్ను పోలీసులు ప్రశ్నించగా.. రాత్రి 2గంటల ప్రాంతంలో ఫ్యాన్కు ఉరేసుకుందని, తానే చున్నీని కత్తిరించి శిరీషను మంచం మీద పడుకోబెట్టానని చెప్పాడు.
అయితే, తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మరణం వెనుక తనకు అనుమానాలున్నాయని భర్త సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్య కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు. రాజీవ్ను ఘటనపై మరోసారి విచారించారు పోలీసులు. ఓసారి బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని, మరోసారి ఫ్యాన్కు ఉరివేసుకుందని రాజీవ్ చెబుతుండటంపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా, సతీష్ చంద్ర, శిరీషలకు 12ఏళ్ల కూతురు ఉంది.