బీటెక్ విద్యార్థిని మృతదేహం లభ్యం: మల్లారెడ్డి ఇంజినీరింగ్ స్టూడెంట్గా: అనుమానాలెన్నో
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పేట్ బషీరాబాద్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని మృతదేహం లభించింది. ఖాళీ స్థలంలో కనిపించిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి వివరాలను ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉందని చెబుతున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతురాలి పేరు చంద్రిక. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ఆమె స్వస్థలం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ. ఇంజినీరింగ్ చదువుతూ పేట్ బషీరాబాద్ సమీపంలోని మైసమ్మగూడలో గల హాస్టల్లో నివసిస్తున్నారు. ఈ ఉదయం హాస్టల్ భవనానికి ఆనుకునే ఉన్న ఖాళీ స్థలంలో నిర్జీవంగా కనిపించారు. చంద్రిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పెట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
చంద్రిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హాస్టల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు ఓ నిర్ధారణకు వచ్చారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత.. చంద్రిక ఒంటరిగా హాస్టల్ భవనం పైకి వెళ్లడం అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. దీన్ని ఆధారంగా చేసుకుని.. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన సంఘటనల గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ- అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.
బీటెక్ విద్యార్థిని మృతదేహం లభ్యం: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్గా: అనుమానాలెన్నో#Student #college pic.twitter.com/VbWiuzPGeK
— oneindiatelugu (@oneindiatelugu) March 23, 2021