హృదయవిదారకం: సెల్ టవర్పై ఉరేసుకుని రైతు ఆత్మహత్య, పిల్లలు ఏడుస్తున్నా..
కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే 35 ఏళ్ల రైతు సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు కన్నీళ్లు పెడుతున్నా.. ఆ రైతు తని నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ హృదయ విదారక ఘటన అక్కడివారిని కలిచివేసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట కాలువ నీరు వెళ్తుండటంతో పరిహారం చెల్లించాలని గత నాలుగేళ్లుగా అధికారులు, గ్రామస్తులకు మొరపెట్టుకున్నాడు. అయితే, రెండు సంవత్సరాల క్రితం అప్పటి తహసీల్దార్ అమీన్ సింగ్ ఆయన భూమికి వెలకట్టి రూ. 2 వేలు పరిహారంగా చెల్లించారు.
గత సంవత్సరం గ్రామ రైతులు చెరువు కింద పంటలు సాగు చేయలేదు. కానీ, ఈ ఆదివారం రైతులు చెరువు సమీపంలో పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో తన భూమి మీదుగా మళ్లీ నీరు వెళ్తుందని మనస్తాపం చెందారు ఆంజనేయులు. ఈ క్రమంలోనే సోమవారం సెల్ఫోన్ టవర్ ఎక్కిన ఆంజనేయులు.. ఎస్సై శంకర్, తహసీల్దార్ మారుతితో ఫోన్లో మాట్లాడారు. వారు ఎంత సర్దిచెప్పినా ఒప్పుకోలేదు. ఎస్పీ, డీఎస్పీ ఇక్కడికి రావాలని పట్టుబట్టారు.
సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎంత చెప్పినా వినలేదు. తువ్వాలుతో సెల్ టవర్కు ఉరేసుకుని అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆంజనేయులు. అతని పిల్లలు కూడా వద్దు డాడీ అంటూ ఏడ్చినా కూడా అతడు తన కఠిన నిర్ణయాన్ని విరమించుకోలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఆర్డీవో శ్రీను నాయక్, డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆంజనేయులు మృతదేహాన్ని కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు ఆత్మహత్యతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆంజనేయులు మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.