కామాంధుల పైశాచికం: దళిత అమ్మాయిపై 6నెలలుగా గ్యాంగ్రేప్
హైదరాబాద్ నగరంలో ముగ్గురు కామంధులు ఓ అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టారు.
హైదరాబాద్: నగరంలో ముగ్గురు కామంధులు దారుణానికి ఒడిగట్టారు. ఓ వృద్ధాశ్రమంలో పని చేస్తున్న దళిత బాలిక(12)పై ఆశ్రమ నిర్వాహకులైన ఆ ముగ్గురు.. ఆరునెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ దారుణ ఘటనకకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. రాజమండ్రికి చెందిన ఓ బాలిక(12) తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తన బంధువులైన ఇందిర, శివశంకర్ నాగోలులోని అక్షయ ఓల్డేజ్హోంలో పని చేస్తుండటంతో పూటగడవని పరిస్థితుల్లో ఆ బాలిక కూడా వచ్చి అదే హోంలో గత సంవత్సరం పనిలో చేరింది.
కొన్నాళ్లకు ఆమె బంధువులు ఇద్దరూ పనిమానేసినా ఆమె మాత్రం అక్కడే కొనసాగుతోంది. ఒంటరిగా ఉన్న బాలికపై నిర్వాహకులు గజ్జెల మాణిక్యరావు, అనుమూల శ్రీనివాస్రెడ్డిల కన్ను పడింది. తప్పతాగి వచ్చి ఒకరికి తెలియకుండా ఒకరు బలవంతంగా ఆమెను లోబరచుకొని తరచూ అత్యాచారానికి పాల్పడేవారు.
కడుపునొప్పి, రక్తస్రావంతో తల్లడిల్లిన బాలికకు మాత్రలు ఇచ్చి వేసుకోమనేవారు. ఎవరికైనా చెబితే చంపుతామంటూ బెదిరించేవారు. అక్కడే అటెండర్గా పనిచేసే వేణుగోపాల్ సైతం బెదిరించి ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు.
కాగా, అంతకుముందు అక్కడే పనిచేసిన బాధితురాలి బంధువులు గత డిసెంబరులో వృద్ధాశ్రమానికి వచ్చి నీరసించిపోయిన అమ్మాయిని చూసి ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఏం జరిగిందో చెప్పాలని అడగడంతో బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు సోమవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.