క్యాన్సరంటూ స్నేహితులకే రూ.40 లక్షల టోపీ పెట్టిన యువతి!
తనకు క్యాన్సరంటూ ఓ యువతి తన స్నేహితుల వద్ద మొరపెట్టుకుంది. తనకు ఆర్థిక సహాయం చేయాలంటూ ఫేస్బుక్ ద్వారా కోరింది. దీంతో కరిగిపోయిన వారు ఆమెకు ఎలాగైనా సాయం చేయాలని తలో కొంత డబ్బు అందజేశారు.
హైదరాబాద్: తనకు క్యాన్సరంటూ ఓ యువతి తన స్నేహితుల వద్ద మొరపెట్టుకుంది. తనకు ఆర్థిక సహాయం చేయాలంటూ ఫేస్బుక్ ద్వారా కోరింది. దీంతో కరిగిపోయిన వారు ఆమెకు ఎలాగైనా సాయం చేయాలని తలో కొంత డబ్బు అందజేశారు. అయితే, ఆమె చేసింది మోసమని తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. సైదాబాద్కు చెందిన సమియా తన తండ్రికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక క్యాన్సర్ బాధితులకు సాయం చేసేందుకు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయని తెలుసుకుంది. వెంటనే తానే క్యాన్సర్ రోగి అవతారమెత్తి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది.
తండ్రి వ్యాధి విషయమై వైద్యులతో మాట్లాడేప్పుడు వీడియోలు తీసింది. అంతేగాక, వైద్యులు రాసిచ్చిన మందులు, చీటీలపై తండ్రి పేరు తీసేసి తనపేరును చేర్చింది. వాటిని తన ఫేస్బుక్ ఖాతానూ, దాతల వెబ్సైట్లలోనూ పెట్టింది. సౌదీఅరేబియాలో ఉన్న ఆమె స్నేహితులు ఇది చూసి చలించిపోయారు.
సమియాకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. స్నేహితులంతా కలిసి కొంత సొమ్ము సేకరించి దఫ దఫాలుగా పంపారు. అలా రూ. 40 లక్షల వరకు ఆమె ఖాతాలో జమ చేశారు. వారం క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలియజేయడంతో సౌదీ నుంచి ఇద్దరు స్నేహితులు ఆమెను పరామర్శించడం కోసం హైదరాబాద్ చేరుకుని ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడ ఆరా తీయడంతో ఆమె చేసిన మోసం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై ఫాతిమా అనే బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమియా వీడియో ద్వారా తమ ఆసుపత్రికి భంగం కలిగిందంటూ క్యాన్సర్ ఆసుపత్రి ఎండీ ఉన్నతాధికారులకు చెప్పడంతో ఆమెపై మరోకేసు కూడా నమోదైంది. పరారీలో ఉన్న సమియా కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.