రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్యార్డు వద్ద రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాల కోసం ఘటనాస్థలిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల రెండో రైల్వేగేట్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రిమిసంహారక మందు సేవించి తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య
మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్ గ్రామంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. కూచూర్ గ్రామానికి చెందిన చాకలి చంద్రయ్యకు మహబూబ్నగర్ మండలం బొక్కలోనిపల్లి గ్రామానికి చెందిన దుర్గ(25)తో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చంద్రయ్య, దుర్గ కాయకష్టం చేస్తూ ఇళ్లల్లో బట్టలు ఉతుకుతూ ఇద్దరు చిన్నారులను గ్రామంలోని పాఠశాలలో చదివిస్తూ జీవించే వారు.
కొన్నాళ్లుగా వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భార్య సక్రమంగా పనులు చేయడం లేదని చంద్రయ్య దుర్గను మందలించే వాడు. ప్రతిరోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం చంద్రయ్య, దుర్గలు గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో చంద్రయ్య అలిగి ఓ గదిలో నిద్రిస్తుండగా అప్పటికే చనిపోవాలని నిర్ణయించుకున్న దుర్గ పక్క గదిలో తలుపులు మూసివేసి తనతో పాటు తన పిల్లలకు క్రిమిసంహారక మందు తాగించి తాను కూడా సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
పక్క గదిలో నుండి అరుపులు వినిపించడంతో ఉలిక్కిపడి లేచిన చంద్రయ్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని తలుపులను పెకిలించివేశారు. అప్పటికే చంద్రయ్య పెద్ద కుమారుడు శివకుమార్(7) మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న దుర్గ, ఆమె చిన్న కుమారుడు గణేష్(5)లను 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గ, గణేష్లు మృతి చెందారు.