దుర్గమాత కలలో చెప్పిందని.. ఒంటికి నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. దుర్గమాత కలలోకి వచ్చి చనిపోవాలని చెప్పిందని ఓ వ్యక్తి తన ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యనగర్కు చెందిన నాగేశ్వరరావు(55) ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించారు.
కాగా, నవంబర్ 3న రాత్రి శరీరానికి నిప్పంటించుకుని కాల్చుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మంటలు ఆర్పివేసి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అతడు కన్నుమూశాడు.
దుర్గామాత కలలోకి వచ్చి తనను చనిపొమ్మని చెప్పడం వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు మృతుడు మరణ వాంగ్మూలంలో పేర్కొనడంతో, ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్ఐ కొట్టాడని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఎస్ఐ కొట్టాడని ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గంగాధర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగాధర మండలం హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన ప్రభాకర్(40) అనే వ్యక్తిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారు.
ఈ విషయమై బాధితుడు బుధవారం గంగాధర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. కాగా, ఎస్ఐ మొగిలి ఫిర్యాదు తీసుకుపోగా.. ఎవరూ కొట్టకుండానే నాటకాలు ఆడుతున్నావని ప్రభాకర్పై చేయిచేసుకున్నాడు. మనస్తాపానికి గురైన ప్రభాకర్ ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. దీంతో హుటాహుటిన ప్రభాకర్ను కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.