సైకో వీరంగం: గొంతుకోసి తల్లి, భార్య, కూతురు హత్య
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్యగావింపబడ్డారు. రాంరెడ్డి అనే వ్యక్తి సొంత తల్లిని, కట్టుకున్న భార్య, కన్న కూతురుని కత్తితో గొంతుకోసి హతమార్చాడు.
మృతులు సుభద్ర(65), రాధిక(40), అక్షయ(14)గా గుర్తించారు. ఇంట్లో నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బాలాపూర్లోని సాయినగర్లో చోటుచేసుకుంది.
రాంరెడ్డి పెద్ద కూతురు ప్రత్యూష(17) రాంరెడ్డి బారి నుంచి తప్పించుకుని కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో రాంరెడ్డి అక్కడ్నుంచి పారిపోయాడు. గ్రామస్తులు వెంబడించడంతో గ్రామ సమీపంలోని ఓ పాడుబడ్డ బావిలో దూకాడు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడ్ని బావిలో నుంచి బయటికి తీసి అదుపులోకి తీసుకున్నారు. రాంరెడ్డి ఆస్తి పంపకాలు చేయడం లేదనే ఈ హత్యలకు పాల్పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు.
తుపాకీతో బెదిరించి బంగారం చోరీ
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. మేడ్చల్ మండలం పూడూరు చౌరస్తా వద్ద ఇద్దరు మహిళలను గుర్తుతెలియని దుండగులు వెంబడించారు.
తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆ మహిళలను బెదిరించి వారి నుంచి 15 తులాల బంగారం దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.