ఎస్ఐతోపాటు అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు: ఒకరికి గాయాలు
కరీంనగర్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి పెట్రోల్తో అధికారులపై దాడికి పాల్పడ్డాడు. దారి అడ్డంగా వేసిన కర్రలు తీయాలంటూ గ్రామానికి వెళ్లిన అధికారులపై పెట్రోల్ పిచికారి చేశాడు. నిప్పంటుకోవడంతో ఓ అధికారికి గాయాలయ్యారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తుంగూరులో దారి వివాదంలో అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడు దారికి అడ్డంగా కర్రలు పెట్టాడు. దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించి కర్రలు తొలగించేందుకు స్థానిక తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీవో ఆ గ్రామానికి వెళ్లారు.
అధికారులు రావడాన్ని గమనించిన గంగాధర్.. వారిపై పెట్రోల్ పోశాడు. ఈ క్రమంలో ఎస్సై అతడ్ని ప్రటిఘటించి అడ్డుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో గంగాధర్ నిప్పంటించాడు. పక్కనే ఉన్న ఎంపీవో రామకృష్ణరాజుకు మంటలు అంటుకోవడంతో ఆయన పరుగులు పెట్టారు. అనంతరం ఆయనపై స్థానికులు నీళ్లు చల్లి మంటలు ఆర్పారు.
అప్పటికే ఆయన చేతులకు గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు గంగాధర్ను అరెస్ట్ చేశారు.
డబ్బులు ఇవ్వలేదని భార్యకు నిప్పంటించిన భర్త
హైదరాబాద్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన ఓ భర్త.. డబ్బులు ఇవ్వలేదని భార్యను పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో నివాసముంటున్నారు మాసరాజు(56), అనితా బాయి(52) దంపతులు. వీరి కుమారుడు బాలుచందర్ కు పెళ్లి చేశారు.
అనితాబాయి ఉస్మానియా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ లేవర్ స్వీపర్ గా పనిచేస్తోంది. భార్య సంపాదనపైనే ఆధారపడిన రాజు.. ఆమెను నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడు. మే 8న మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో ఇంటికొచ్చాడు. డబ్బుల కోసం భార్యతో గొడవపడ్డాడు. ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు. ఆ తర్వాత నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. కుమారుడికి సమాచారం అందించడంతో అతడు తల్లిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.