హన్మకొండ లాడ్జీలో ప.గో వ్యాపారి ఆత్మహత్య
హన్మకొండ కొత్తబస్స్టేషన్ సమీపంలో ఉన్న యమున లాడ్జిలో పాడిశెట్టి నర్సింహమూర్తి (28) అనే బట్టల వ్యాపారి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వరంగల్: హన్మకొండ కొత్తబస్స్టేషన్ సమీపంలో ఉన్న యమున లాడ్జిలో పాడిశెట్టి నర్సింహమూర్తి (28) అనే బట్టల వ్యాపారి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండ క్రైం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరిజిల్లా కొప్పర్లు గ్రామానికి చెందిన నర్సింహమూర్తి వ్యాపార రీత్యా వరంగల్కు వచ్చాడు.
హన్మకొండ బస్టాండ్ సమీపంలోని యమున లాడ్జిలో డిసెంబర్ 11నుంచి రూం.నెంబర్ 127లో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం ఉదయం వర్కర్లు గదులను ఊడ్చేందుకు లేపే ప్రయత్నం చేయగా ఎంతకూ తులుపులు తీయలేదు. అనుమానం వచ్చిన సిబ్బంది నిర్వాహకులకు తెలియజేశారు.
దీంతో లాడ్జి ఓనర్ శ్రీరాముల సంపత్కుమార్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. నర్సింహమూర్తి మంచంపై నిర్జీవంగా కనిపించాడు. మృతుడి పక్కన పురుగల మందు లభించినట్లు పోలీసులు తెలిపారు.
అప్పులు ఎక్కువ కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. చనిపోయిన విషయాన్ని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహాల ఆచూకీ లభ్యం
వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైలు ప్టాలపై మంగళవారం మృతిచెందిన ఇద్దరు యువలకును బుధవారం పత్రికలలో చూసి గుర్తించారు. అయితే మృతులు మద్యం మత్తులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందినట్లుగా జీఆర్పీ విచారణలో తేలింది.
అంతేగాకుండా మృతులతోపాటు ఉన్న మరో యువకుడు ఈ సంఘటనలో గాయపడి ప్రాణాలతో బయటపడినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులు నగరంలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నట్లుగా తెలిసింది. వరంగల్ ప్రభుత్వ రైల్వే పోలీసు సీఐ స్వామి బుధవారం సాయంత్రం తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్లోని పాల్గ్ జిల్లాకు చెందిన ఈశ్వర్ (25), దేవలాల్సింగ్ (3), చత్తీస్గడ్లోని రాజ్నందన్కు చెందిన పెరుమాళ్ యాదవ్ (26)లు నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోనే నివసిస్తున్నారు.
మంగళవారం ముగ్గురు మద్యం తాగి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని ఈశ్వర్, పెరుమాళ్ యాదవ్ మృతిచెందగా దేవ్లాల్ సింగ్ గాయాలతో బయట పడ్డాడు. కాగా, బుధవారం పత్రికలో వచ్చిన వార్తను చూసి వారు పనిచేస్తున్న భవన నిర్మాణ మేస్త్రి వారి ఫొటోలను గుర్తుపట్టి పోలీసులను సంప్రదించాడన్నారు.
గాయపడ్డ దేవీలాల్ సింగ్ను విచారించగా జరిగింది చెప్పాడని తెలిపారు. ఎంజీఎం మార్చురీలో మృతుడు ఈశ్వర్ చెల్లెలు యశ్వంతి (12) తన సోదరుడి, మరో మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ చెప్పారు. మృతుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చామని, గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారికి అప్పగిస్తామని ఆయన తెలిపారు.