పెళ్లయిన 3 నెలలకే... చెరువులో శవమై తేలిన నవ వధువు... చివరి మెసేజ్ అదే...
పెళ్లయి మూడు నెలలు గడిచాయో లేదో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. జీవిత భాగస్వామిపై ఎన్నో కలలు,ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టిన ఆమెకు కొన్నాళ్లకే ఊహలన్నీ తలకిందులయ్యాయి. ఓవైపు అత్తగారి వేధింపులు... భర్త కూడా ఆమెకు వత్తాసు పలకడంతో ఆమె తట్టుకోలేకపోయింది. పెళ్లయిన కొద్దిరోజులకే వేధింపులు మొదలవడంతో ఇక తన జీవితం ఎలా ఉంటుందోననే బెంగ పెట్టుకుంది. ఈ క్రమంలో మానసికంగా కుమిలిపోయిన ఆమె బుధవారం(అగస్టు 4) ఆత్మహత్యకు పాల్పడింది.

మే 28న అతనితో వివాహం...
దుబ్బాక మున్సిపాలిటీలోని రెండో వార్డుకు చెందిన అక్కల రాధా కిషన్ గౌడ్-లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పవిత్ర,అలియాస్ తేజస్విని (22)కి గంభీర్పూర్ గ్రామానికి చెందిన చేపూరి యాదయ్య,బాలలక్ష్మిల కుమారుడు శ్రీకాంత్ గౌడ్తో ఈ ఏడాది మే 28న వివాహం జరిగింది. వివాహమైన కొద్దిరోజులకే పవిత్రకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి. భర్త కూడా తల్లికే వత్తాసు పలకడం... అతనూ వేధింపులకు దిగడంతో పవిత్ర తట్టుకోలేకపోయింది.

అదే చివరి మెసేజ్...
వేధింపులు ఎక్కువవడంతో పవిత్ర మానసికంగా కుమిలిపోయింది. ఇక ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఈ క్రమంలో బుధవారం(అగస్టు 4) బీఎడ్ సెమిస్టర్ పరీక్ష రాసేందుకు దుబ్బాకలోని కాలేజీకి వెళ్లింది. భర్త శ్రీనివాస్ గౌడ్ బైక్పై ఆమెను దిగబెట్టి వచ్చాడు. పరీక్ష అనంతరం పవిత్ర తన సోదరుడి స్నేహితుడి సెల్ఫోన్కు ఒక మెసేజ్ పంపించింది. తనకు జీవితంపై విరక్తి కలిగిందని అందులో పేర్కొంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసింది.

చెరువులో దూకి ఆత్మహత్య
కాలేజీ నుంచి కాలి నడకన దుబ్బాక శివారులోని చెరువు వద్దకు వెళ్లింది. అక్కడే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పవిత్ర సోదరుడి స్నేహితుడు ఆమె చేసిన మెసేజ్పై కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. పవిత్ర ఫోన్ అప్పటికే స్విచ్చాఫ్ అవడంతో అంతా కలిసి ఆమె కోసం గాలించారు. దుబ్బాక పట్టణం మొత్తం తిరిగినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

భర్త,అత్తలపై కేసు నమోదు....
మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుబ్బాక శివారులోని చెరువులో పవిత్ర మృతదేహాన్ని గుర్తించారు. చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం పవిత్ర కుటుంబ సభ్యులను పిలిపించగా... ఆ మృతదేహం ఆమెదేనని గుర్తించారు. అత్త,భర్త వేధింపులు భరించలేకనే పవిత్ర ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. పవిత్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త,అత్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Recommended Video

మరో ఘటనలో దంపతుల ఆత్మహత్య
మరో ఘటనలో ఓ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్ ఈసీఐఎల్కు చెందిన పమ్మి లక్ష్మణాచారి (55), హేమలత (48) దంపతులుగా గుర్తించారు. పది రోజుల క్రితం వీరి కుమార్తె అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ దూరమవడంతో అప్పటినుంచి తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. అదే ఇంట్లో ఉంటే బిడ్డ జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతారని... హేమలత సోదరుడు వేమన కుమార్ వారిని ఇటీవల పాల్వంచలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం(అగస్టు 4) వేమన కుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లగా... లక్ష్మణాచారి,హేమలత గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'ఆ ఇంట్లో నా బిడ్డ లేని జీవితం ఇక మాకు వద్దు.. అందుకే చావడానికి వెళ్తున్నాం. సారీ మేముండం.. మా కోసం వెతకమాకండి.. నా బిడ్డకు అన్ని కార్యక్రమాలు మంచిగా చేయండి.' అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications