అమెరికాలో ప్రమాదం: తెలుగు మహిళ మృతి, ఆమె భర్త, కొడుకుకి తీవ్రగాయాలు
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్కు చెందిన రత్న జ్యోతి అనే మహిళ మృతి చెందింది.
హైదరాబాద్: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన గోపాలం రత్న జ్యోతి, ఆమె భర్త సునీల్ సాగర్ గత కొంతకాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. వారికి దైవిక్ సాగర్ (21 నెలలు) అనే కుమారుడు ఉన్నారు.
ధర్మారం(బి)కి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ కుమారుడు సునీల్ సాగర్ న్యూయార్క్లోని ఐసీఐసీఐ బ్యాంకులో ట్రైజరీ మేనేజర్గా పని చేస్తున్నాడు. కాగా, ఆదివారం రాత్రి సునీల్ కుటుంబంతో షాపింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో రత్నజ్యోతి మృతి చెందగా, సునీల్, దైవిక్సాగర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని న్యూయార్క్లో ఉంటున్న వారి బంధువులు ఫోన్ ద్వారా సగ్రామంలో ఉంటున్న కుటుంబసభ్యులకు చేరవేశారు.
దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని త్వరగా రప్పించడానికి ఆటా, ఇతర సంఘాలతో మాట్లాడుతున్నట్లు సునీల్ తండ్రి గోపాలం విద్యాసాగర్ తెలిపారు.