Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఔటర్ రింగు రోడ్డు: మృత్యుమార్గం, ప్రమాదాలిలా(ఫొటోలు)

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు అంటే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రింగ్ రోడ్డుపై జరుగుతన్న ప్రమాదాలతో యేటా అనేకమంది మృత్యువాతపడుతున్నారు.

అతి వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, మూడు గంటల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆప్కాబ్ ఛైర్మన్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ (క్రాష్ బారియర్)ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి(52), డ్రైవర్ స్వామిదాసు(40) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

సీట్ బెల్ట్ ధరించిన కారణంగా పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మరో ఔటర్ ప్రమాదంలో దక్షిణాఫ్రికాలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వాసు భార్య మాధురి చనిపోయారు. ఈ రెండు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు చెబుతున్నారు.

a story on outer ring road hyderabad mishaps

కాగా, ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ఆయనతోపాటు పార్టీ నేతలు దుర్గా ప్రసాద్, దశరత్ రెడ్డి, డ్రైవర్ ‌కు కూడా గాయాలయ్యాయి.

మే నెలలోనే జరిగిన మరో ప్రమాదంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. . ఓ ద్విచక్ర వాహనందారుడిని ఓ లారీ డ్రైవర్ చిరునామా అడుగుతున్న నేపథ్యంలో వెనుక నుంచి వస్తున్న కర్ణాటకు చెందిన మరో లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గాలంటే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే వాహనంలోని ప్రయాణికులందరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. నిద్రమత్తు, మద్యం మత్తులో వాహనాలు నడపకపోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. అతివేగంతో వాహనాలు నడకూడదు.

a story on outer ring road hyderabad mishaps

2015 ఏప్రిల్‌లో...

హైదరాబాదు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఏడాది ఏప్రిల్ ప్రమాదం సంభవించింది. కోకాపేట వద్ద రెండుకార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సల్మాన్‌ అనే మెడికో మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

2015 జనవరిలో..

అవుటర్ రింగు రోడ్డు పైన ఓ కారు మంటలు అంటుకొని దగ్ధమైంది. గుంటూరు నుండి హైదరాబాద్నగరానికి వస్తున్న ఈ కారులో యజమానితో పాటు నలుగురు ఉన్నారు. శంషాబాద్ పరిధిలోకి రాగానే ఆయిల్ లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు. దీంతో అందరు కూడా కారులో నుండి బయటకు దిగారు. వారు దిగిన వెంటనే కారులో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి కూడా ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

2014 నవంబర్‌లో...

మేడ్చల్ పరిధిలోని ఓటర్ రింగ్ రోడ్డు పైన ఓ కారు డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐఐటీ విద్యార్థి సీహెచ్ రామలింగ రాజు మరణించారు. శామీర్ పేట మండలం తూంకుంట వాసి అయిన రామలింగ రాజు మద్రాస్ ఐఐటీలో ఫైనలియర్ చదివేవాడు. సెలవుల్లో ఇక్కడకు వచ్చిన రాజు శనివారం కారులో శామీర్ పేట నుండి మేడ్చల్ వస్తూ మునిరాబాద్ పరిధిలో ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టాడు.

2014 సెప్టెంబర్‌లో...

హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ సూర్యనారాయణ కుటుంబసభ్యులతో గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య నాగరామలక్ష్మి (53) నాలుగు రోజుల క్రితం విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లింది.

రాజమండ్రిలో ఎంబీబీఎస్‌ చదువుతున్న కూతురు సింధూర (19)ను దసరా పండగకు హైదరాబాద్‌ తీసుకురావాలనుకుంది. తల్లీకూతుళ్లతో పాటు నాగరామలక్ష్మి సోదరుడు మహీధర్‌ (50), అతడి కుమార్తె అపర్ణ (20) సోమవారం కారులో హైదరాబాద్‌ బయలుదేరారు.

మార్గమధ్యంలో శంషాబాద్‌ మండల పరిధిలోని కిషన్‌గూడ జంక్షన్‌ వద్ద ఆగి ఉన్న కర్నాటక రాష్ట్రానికి చెందిన లారీని కారు ఢీకొంది. సగ భాగం లారీ కిందకి దూసుకుపోవడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న మహీధర్‌, నాగరామలక్ష్మి, సింధూరకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

a story on outer ring road hyderabad mishaps

2014 మేలో...

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై 2014 మేలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చి తిరిగి గుంటూరు వెళుతుండగా తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై డివైడర్‌ను ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన మల్లికార్జున్‌రెడ్డి (53) తన తల్లి బస్వమ్మ (75) అనారోగ్యానికి గురికావడంతో నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో గురువారం తల్లితో పాటు బంధువు బాలకృష్ణారెడ్డి (29)తో కలిసి మధ్యాహ్నం కారులో గుంటూరు బయలుదేరారు. బాలకృష్ణారెడ్డి కారు డ్రైవింగ్ చేస్తుండగా, మల్లికార్జున్‌రెడ్డి, బస్వమ్మ వెనుక కూర్చున్నారు.

తుక్కుగూడలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై గల ఎక్సిట్ 14 వద్ద కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.

2013 డిసెంబర్‌లో...

ఔటర్ రింగు రోడ్డుపై 2013 డిసెంబర్‌లో ఓ కారు దగ్ధమైంది. శంషాబాద్ విమానాశ్రయం నుండి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని పసిగట్టిన కారు ఓనర్ వెంటనే కిందకు దిగారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.

అంతకు ముందు రాత్రి కూడా ఓ కారు, మోటార్ బైక్ ఢీకొని దంపతులు మృత్యువాత పడ్డారు. రింగ్ రోడ్డు పైన వెళ్తున్న దంపతులు బైక్ పైన వెళ్తుండగా హుడా కాలనీ వద్ద వారిని కారు ఢీకొంది. దీంతో దంపతులు మృతి చెందారు.

ఆ దంపతులు రాజేంద్ర నగర్ నుండి శంషాబాద్ వైపుకు బైక్ పైన వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో వారు హుడా కాలనీకి చేరుకున్న తర్వాత ఓ కారు ఢీకొట్టింది. దీంతో వారు కిందపడ్డారు. ఆ తర్వాత వారు మృత్యువాత పడ్డారు.

a story on outer ring road hyderabad mishaps

2013 అక్టోబర్‌లో...

రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులోని వట్టినాగులపల్లి వద్ద ఔటర్ రింగు రోడ్డు పైన ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని డిసిఎం వ్యాను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు.
ఈ ఘటనలో హబూబాఖాన్, మూలానబి, సమ్రీన్, దస్తగిరిలు మృతి చెందారు. రాజేంద్ర నగర్‌కు చెందిన పద్దెనిమిది మంది కర్నాటకలోని బీదర్‌లో జరిగిన ఓ వేడుకలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బీదర్ నుండి బయల్దేరిన డిసిఎం వ్యాను మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు వట్టినాగులపల్లి వద్దకు రాగానే ఔటర్ రింగు రోడ్డు పైన ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టింది.

2013 జూన్‌లో...

నగరంలోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద అంబర్‌పేట వద్ద ఓ బిఎండబ్ల్యు కారు అదుపు తప్పి బ్రిడ్జి మీద బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో నుండి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

a story on outer ring road hyderabad mishaps

2013 ఆగస్టులో..

ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి నుంచి లోడుతో పటాన్‌చెరు బయలుదేరిన ఓ లారీ శంషాబాద్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై ముందు వెళుతున్న మరో లారీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురేందర్‌తో పాటు క్లీనర్ మృతి చెందారు.

కాగా, శామీర్‌పేట ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మాజీ మంత్రి పులివీరన్న తనయుడు మృతి చెందారు. రింగ్ రోడ్డుపై కారు బోల్తాపడి మాజీ మంత్రి పులి వీరన్న తనయుడు డాక్టర్ ప్రవీణ్ తేజ(38) దుర్మరణం పాలయ్యారు.

రాజీవ్ రహదారి నుంచి కొంపల్లి వైపు వెళ్లేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారు (ఎపి22క్యూ909)లో అతి వేగంతో వెళ్తుండగా.. షామీర్‌పేటకు రెండు కిలోమీటర్ల దూరంలో అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో తల పగిలి.. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

2011 డిసెంబర్‌లో...

మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించాడు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు.

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని సర్వీసు రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించబోయి ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+