ఫీజు కోసం నిలబెట్టారని.. సెల్ఫోన్లో వీడియో తీసుకుని విద్యార్థి ఆత్మహత్య
కరీంనగర్: జిల్లాలోని పెద్దపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. జూలపల్లి మండల కేంద్రంలోని బ్రిలియంట్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న సంతోష్ రెడ్డి (15) అనే విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు కట్టలేకపోవడంతో మనస్తాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ఫోన్లో వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలు వివరించాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. సంతోష్ రెడ్డి స్వగ్రామం ధర్మారం మండలం అబ్బాపూర్.
ఫీజు కట్టలేదని పాఠశాలలో ఉపాధ్యాయుడు బయట నిలబెట్టడంతో సదరు విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనకు బాధ కలిగిందని, మనకు ఫీజు కట్టే స్తోమత లేదని బాధపడుతూ.. తాను చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా రికార్డింగ్ చేసి అదృశ్యమయ్యాడు.

గురువారం రాత్రి పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్పై గుర్తుతెలియని శవం లభించగా విచారణ చేపట్టిన పోలీసులు అది సంతోష్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు.
పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంతోష్ రెడ్డి మృతితో అబ్బాపూర్ గ్రామంలో ఇటు బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో విషాదం నెలకొంది.
కాగా, విద్యార్థి సంతోష్ రెడ్డి ఘటనపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వేగంగా స్పందించారు. ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే విద్యా శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కడియం కరీంనగర్ కలెక్టర్కు ఫోన్ చేశారు.
ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలను కట్టడి చేయాల్సిందేనని ఈ సందర్భంగా కడియం అభిప్రాయపడ్డారు.
ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వాటిని ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాక ఆత్మహత్యలు చేసుకోరాదని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications