ప్రియుడితో కలిసి భర్తను చంపి దొరక్కుండా భార్య షాకింగ్ స్కెచ్; సీరియల్స్లో విలన్లేం పనికొస్తారు!!
ప్రియుడి మోజులో ఓ భార్య భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. దాని కోసం అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, ఆ మర్డర్ ను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. సీరియల్స్ లో విలన్స్ ను మరిపిస్తూ దారుణానికి ఒడిగట్టిన సదరు క్రిమినల్ భార్య గుట్టు పోలీసుల విచారణలో రట్టయింది.

భర్త ఉండగా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య
ఇంతకు ఏం జరిగిందంటే జనగామ జిల్లా హనుమంత పూర్ తేటకుంట తండాకు చెందిన 32 సంవత్సరాల లకావత్ కొమురెల్లి సికింద్రాబాద్ లోని నామాలగుండు సీతాఫల్మండి లో నివాసముంటూ జిహెచ్ఎంసి పరిధిలో రోజువారీ కూలీలుగా పని చేసుకుంటున్నాడు. కొమురెల్లి కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం కాగా భార్య భారతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక ఈ క్రమంలో రెండేళ్ల క్రితం జనగామ జిల్లా అడవి కేశపురం కి చెందిన బానోతు ప్రవీణ్ తో భారతి కి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధం గా మారింది.

ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసిన భార్య
ప్రవీణ్, భారతి ఇంటికి సమీపంలోనే నివాసం ఉండటం తో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఇక ఇటీవల భారతీ ప్రవీణ్ దగ్గరగా ఉండటాన్ని గమనించిన కొమురెల్లి భార్యను గట్టిగా మందలించాడు. దీంతో తన ప్రియుడితో కలవకుండా భర్త అడ్డుకుంటున్నారని భావించిన భార్య, ఎలాగైనా భర్తను అడ్డు తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. రాత్రిపూట మద్యం మత్తులో ఉన్న కొమురెల్లి గొంతుకు చున్నీ బిగించి, ప్రవీణ్ తో కలిసి ప్రాణం తీసింది.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పై నుండి బైక్ తో పాటు భర్త మృతదేహం క్రింద పడేసిన నిందితులు
అనంతరం కొమురెల్లి మృతదేహాన్ని ఇద్దరూ కలిసి భువనగిరి వైపు తీసుకువెళ్లి, భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి ద్విచక్ర వాహనాన్ని, మృతదేహాన్ని కింద పడేసి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడని పోలీసులకు అర్థమయ్యేలా సదరు క్రిమినల్ భార్య సీన్ క్రియేట్ చేసింది. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతుని సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం ఆధారంగా కుటుంబ సభ్యులకు కాల్ చేసి సమాచారం ఇచ్చి దర్యాప్తు ప్రారంభించారు.

భారతిపై అనుమానం .. పోలీసుల విచారణలో అసలు గుట్టు రట్టు
సంఘటనా స్థలం వద్ద మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పాటు, కొమురెల్లి సోదరుడు వదిన పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కొమురెల్లి భార్య భారతి ని విచారించారు. ఇక ఈ విచారణలో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియుడి కోసం భర్తను చంపేశానని భారతి నేరాన్ని అంగీకరించింది. ఈ మేరకు భారతీ, ప్రవీణ్ లను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మొత్తంగా చూస్తే ఈ కేసులో ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య కటకటాల పాలు కాగా, భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇక వీరిద్దరికీ దూరమై ముగ్గురు ఆడపిల్లలు అనాథలుగా మారారు.












Click it and Unblock the Notifications