మహిళపై 40మంది దాడి: పట్టకారుతో పళ్లన్నీ పీకారు
నిజామాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తోందనే నెపంతో కాళ్లు తొక్కిపట్టి.. పట్టకారుతో పళ్లన్నీ పీకేసి ఓ మతిస్థిమితం లేని మహిళపై పైశాచిక దాడికి పాల్పడ్డారు 40మంది మూర్ఖులు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వర్ని మండలం అక్బర్నగర్కు ఓ మతిస్థిమితం లేని మహిళ రెండు రోజుల క్రితం వచ్చింది. ఎక్కడ్నించి వచ్చిందో తెలియదు.
బుధవారం రాత్రి అక్బర్నగర్ సమీప జవహర్నగర్ కాలనీకి వెళ్లి పిచ్చిగా ప్రవర్తిస్తూ తిరిగింది. పోచమ్మ, హనుమాన్ మందిరాల సమీపం నుంచి వస్తుండగా జవహర్నగర్ కాలనీకి చెందిన 40 మంది ఆమెను మంత్రగత్తెగా అనుమానించారు. మూకుమ్మడిగా దాడిచేశారు. కర్రలతో ఇష్టారాజ్యంగా కొట్టారు.
అంతటితో ఆగకుడా ఆమెను వెల్లకిలా పడుకోబెట్టి ఒక్కో చేతిపై, ఒక్కో తొడపై ఇద్దరు చొప్పున నిలబడి ఛాతీపై మరొకరు కాలేసి, తొక్కిపట్టారు. పట్టకారుతో నోటిలో దంతాలన్నీ కిరాతకంగా పీకేశారు. నొప్పి భరించలేక విలవిల్లాడినా అదిమిపట్టి మరీ దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఆమెను గమనించిన కొందరు ఆస్పత్రికి తరలించారు. కాగా, మొత్తం 32 పళ్లను పీకేసినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. కర్రలతో ఇష్టారాజ్యంగా కొట్టడంతో స్పృతప్పిన ఆమె చేతులు, కాళ్లపై నిలబడి తొక్కడంతో ఎముకలు విరిగినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆమెను కొట్టిన దెబ్బలు చూసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు నివ్వెరపోయారు.
ఈ తరహాలో చితకబాదిన కేసులు ఎన్నడూ చూడలేదన్నారు. తలకు బలమైన గాయం కావడంతో స్పృహతప్పిన పరిస్థితిలో ఉన్న మహిళ బతికే అవకాశాలు తక్కువని, హైదరాబాద్కు తీసుకెళ్లాలని పోలీసులకు వైద్యులు సూచించారు. ఈ ఘటనకు సంబంధించి 40 మందిపై కేసు నమోదుచేసినట్లు బోధన్ గ్రామీణ సీఐ దామోదర్రెడ్డి తెలిపారు. ఏడుగురిని రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు.