రాత్రంతా సీబీఐ కోర్టులో నగ్నంగా యువకుడు: ఏం చేశాడంటే?
గురువారం గాంధీభవన్కు ఎదురుగా ఉన్న గగన్విహార్ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 14వ అంతస్తులో సీబీఐ కోర్టు ప్రధాన ద్వారం తాళాలు భద్రతాసిబ్బంది తెరవగా లోపల ఓయువకుడు కనిపించాడు.
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టు గదిలో ఓగుర్తు తెలియని ఓ యువకుడు రాత్రంతా ఉండిపోవడం కలకలం రేపింది. గురువారం గాంధీభవన్కు ఎదురుగా ఉన్న గగన్విహార్ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 14వ అంతస్తులో సీబీఐ కోర్టు ప్రధాన ద్వారం తాళాలు భద్రతాసిబ్బంది తెరవగా లోపల ఓయువకుడు కనిపించాడు.
కాగా, కోర్టులోని పలు గదుల తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఫైళ్లు చిందరవందరగా పడిఉన్నాయి. దీంతో ఆబిడ్స్ పోలీసులకు సమాచారం అందించగా వారు యువకుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఆ యువకుడి పేరు శివకుమార్ (19)గా గుర్తించారు. అతడు దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
అయితే, ఇతను సీబీఐ కోర్టు ప్రాంగణంలోకి ఎప్పుడు, ఎలా ప్రవేశించాడనేది తెలియరాలేదు. రాత్రంతా ఏం చేశాడు..? సిబ్బంది గది తలుపులు తీసేసరికి కంప్యూటర్ వద్ద ప్రత్యక్షం కావడమేమిటనే ప్రశ్నలకు పోలీసుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. కీలకమైన వైయస్.జగన్ కేసును పర్యవేక్షిస్తున్న ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టులోని గదిలో యువకుడు ఏంచేశాడనే కోణాల్లో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో అతను నగ్నంగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 'శబరిమలకు వెళ్లివచ్చాను. నాకేమీ తెలియదు. అనుకోకుండా కార్యాలయంలోకి ప్రవేశించాను. కొన్ని నిమిషాల్లోనే తాళాలు వేయడంతో గత్యంతరం లేక ఇక్కడే రాత్రంతా గడిపాను' అంటూ పోలీసుల విచారణలో శివకుమార్ పేర్కొన్నట్లు తెలిసింది.
పట్టుబడ్డ విద్యార్ధి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అర్థంపర్థం లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. వారు నిందితుడిని స్టేషన్లో విచారిస్తుండగా.. ఉదయం 11గంటలకు ఇక్కడి సీబీఐ కోర్టులో జగన్ విచారణకు హాజరయ్యారు. కాగా, సీబీఐ కోర్టు లైజన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని విచారిస్తున్నట్లు ఆబిడ్స్ సీఐ గంగారాం తెలిపారు.