ఏ సమస్య ఐనా కలాం వైపే చూపు: సతీష్, డిఆర్డీవోతో హైద్రాబాద్ నుంచి ప్రస్థానం
హైదరాబాద్: మిసైల్ అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా తాము మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం వైపు చూసే వారమని ప్రముఖ శాస్త్రవేత్త, ఆర్సీఐ చీఫ్ సతీష్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు. అబ్దుల్ కలాం మృతి విషయం తెలిసి ఆయన మాట్లాడారు.
హైదరాబాదులో పలు డిఫెన్స్ లేబోరేటరీలు వచ్చేందుకు అబ్దుల్ కలాం ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు. డీఆర్డీఎల్, మిథానీ, ఆర్సీఐ, ఐసీబిఎం సెంటర్ తదితరాలు అతని గైడెన్స్లోనే వచ్చాయని చెప్పారు. మాకు ఎలాంటి సమస్య వచ్చినా ఆయన వైపే చూసేవారమని చెప్పారు.
డిఆర్డీవోతో ఇక్కడి నుంచి ప్రస్థానం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు భాగ్యనగరంతో విడదీయరాని బంధం ఉంది. నగరంలోని డిఆర్డీవో (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ)లో భాగమైన డిఆర్డీఎల్లో లేబోరేటరీ విభాగ అధిపతిగా పని చేస్తూ ఇక్కడే పలు మానవీయ ప్రాజెక్టులకు, ఆవిష్కరణలకు ప్రాణం పోశారు.
మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించిన ఆయన హైదరాబాదును సొంత ఊరుకంటే ఎక్కువ అభిమానించేవారనే చెప్పవచ్చు. రాష్ట్రపతి హోదాలో నగరానికి అధికారికంగా పలుమార్లు వచ్చారు. పలు విద్యా, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో జరిగే స్నాతకోత్సవాల్లో స్ఫూర్తిమంతమైన ప్రసంగాలు చేశారు.