ఆహ్వానం హోటల్: స్నేహితుడి కోసం హరికృష్ణ ఇలా, హర్యానా ప్రజలే నమ్మలేదని రేణుక
హైదరాబాద్: నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ కన్నుమూసిన నందమూరి హరికృష్ణ హైదరాబాద్ అబిడ్స్లోని తన ఆహ్వానం హోటల్ను తన స్నేహితుడికి లీజుకు ఇచ్చారట. అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్, ఆహ్వానం హోటల్ ప్రాంగణంకు హరికృష్ణ తరుచు వచ్చేవారు. ఈ హోటల్లో 1001 రూం ఉంది.
ఆయన హైదరాబాదులో ఉంటే ఈ హోటల్కు వచ్చి ఈ గదిలో ఉండేవారు. ఈ హోటల్ను హరికృష్ణ ఆర్థిక కష్టాల్లో ఉన్న తన స్నేహతుడికి లీజుకు ఇచ్చారట. రెండు నెలల క్రితం దీనిని ఆయనకు ఇచ్చారట.

స్నేహితుడికి ఇలా సాయం
స్నేహితుడు కృష్ణారావు వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో ఆయనను పిలిచి హోటల్ను అద్దెకు ఇచ్చి, ఆర్థికంగా కుదురుకునేందుకు సహాయం చేశాడని చెబుతున్నారు. స్నేహితుడిని తన ఇంటికి పిలిపించుకొని, ఇబ్బందుల్లో ఉన్నావని, బాధపడవద్దని, తనకు తోచిన సహాయం చేస్తానని చెప్పి, లీజుకు ఇచ్చాడని తెలుస్తోంది. ఈ హోటల్ బాగా నడుస్తోందని, దీంతో నీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని సూచించాడట.
Recommended Video


హరికృష్ణ మృతితో కన్నీరుమున్నీరు
ఈ విషయాన్ని కృష్ణారావు గుర్తు చేసుకున్నారు. తాను కావలికి వెళ్తున్నానని, తిరిగ వచ్చేందుకు ఆలస్యం అవుతుందని, తన కోసం ఎదురు చూడవద్దని కూడా చెప్పారట. ఆయన తనతో చెప్పిన చివరి మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయని కన్నీరుమున్నీరు అయ్యారు.

హర్యానా ప్రజలు నమ్మలేకపోయారు
హరికృష్ణను కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో తాను, హరికృష్ణ సరదాగా మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. హర్యానాలో ఎన్టీఆర్ పర్యటించిన సమయంలోనూ హరికృష్ణే చైతన్య రథాన్ని నడిపారని చెప్పారు. ఎన్టీఆర్ కుమారుడే డ్రైవింగ్ చేస్తున్నాడంటే హర్యానా ప్రజలు నమ్మలేకపోయారని తెలిపారు. ఆయన మనసు ఎంతో గొప్పది అన్నారు. ఆయన మృతి ఎంతో బాధిస్తోందన్నారు.

హరికృష్ణ అంతిమయాత్ర
కాగా, హరికృష్ణను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా, హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications