బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు
ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన తెలంగాణ ముంఖ్యమంత్రి కేసీఆర్.. ఇన్నాళ్లూ ఛీకొట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలకు వరుసపెట్టి అంగీకారాలు తెలుపుతున్నారు. వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ నేరుగా ఉద్యమంలోకి దిగినా, యూటర్న్ తీసుకుని మోదీ నిర్ణయాలను కీర్తించారు. కేసీఆర్ తీరుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొన్నవేళ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ మరో బాంబు విసిరారు. అధికార పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, కేసీఆర్ భవితవ్యాన్ని కూడా తేల్చేశారు..
Recommended Video


గవర్నర్తో బండి టీమ్ భేటీ
కేసీఆర్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుంటిసాకులతో రాష్ట్ర ప్రజలను మోసం చేసేలా దొంగ నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో శుక్రవారం భేటీ అయిన బీజేపీ నేతలు.. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రాజ్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

టెర్రరిస్టుల పంథాలో టీఆర్ఎస్-ఎంఐఎం
‘‘34 లక్షల మంది జనం ఓట్లేసి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తే.. ప్రజానిర్ణయాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ తీవ్రంగా అవమానపరుస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన కార్పొరేటర్లను కూడా అవమానపరుస్తున్నారు. గ్రేటర్లో టీఆర్ఎస్ ఆ కొన్ని సీట్లైనా గెలిచిందంటే ఉగ్రవాదుల తరహాలో రెచ్చిపోబట్టే. తుపాకులతో బెదిరించి, పోలింగ్ బూత్ లను క్యాపర్ చేసి, బాక్సులను ఎత్తుకెళ్లి, రిగ్గింగ్ చేసినట్లి ఘటనలే నిన్న తెలంగాణ నడిబొడ్డున జరిగింది. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి టెర్రరిస్టుల పంథాలో వ్యవహరించి ఆ మాత్రమైన సీట్లు సాధించింది. అసలు ఎంఐఎం పార్టీ సహకారం లేకుంటే టీఆర్ఎస్ కు ఇన్ని సీట్లు కూడా వచ్చుండేవి కావు. వీళ్ల గెలుపే అడ్డదారిలో దక్కిందనుకుంటే, గెలిచిన తర్వాత కూడా ప్రజాతీర్పునకు, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

సిగ్గులేని మంత్రులు.. ఓడినవాళ్లతో..
జీహెచ్ఎంసీ నూతన కౌన్సిల్ ఏర్పాటుకు ఇంకా రెండు నెలల సమయం ఉందని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు పిచ్చికూతలు కుస్తున్నారే.. మరి ఇన్ని నెలలు సమయం ఉంటే ముందస్తు ఎన్నికలు ఎందుకు పెట్టారు? హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు వరదల్లో మునిగి ఉన్నాయి, ఇప్పుడే ఎన్నికలు వద్దు, ముందు ప్రజల్ని ఆదుకోండి, వరద బాధితుల ఇబ్బందుల్ని తీర్చండని బీజేపీ నెత్తినోరు మొత్తుకున్నా కేసీఆర్ వినిపించుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఎక్కడ బీజేపీ మరింత శక్తిమంతంగా తయారవుతుందోననే భయంతో కేసీఆర్ ఆదరబాదరగా గ్రేటర్ ఎన్నికలు పెట్టాడు. అప్పటికప్పుడు ఎన్నికలు పెడితే బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందని, టీఆర్ఎస్ అడ్డదారుల్లోనైనా గెలుస్తుందనే అంచనాలతో కేసీఆర్, ఎంఎంఐ కలిసి ఎన్నికలు నిర్వహించారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రచారం చేసుకునే అవకాశం దక్కొద్దనే, వెంటవెంటనే నామినేషన్లు, ఎన్నికలు ఫటాఫటా చేపట్టారు.

దమ్ములేకుంటే ఎన్నికలెందుకు పెట్టారు?
మరి ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాలను ఎందుకు వాయిదా వేస్తోంది? టీఆర్ఎస్ వాళ్లు సిగ్గులేని చర్యలకు పాల్పడుతారని తెలిసే, మా బీజేపీ కార్పొరేటర్లు అందరూ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మీద ప్రమాణాలు చేశారు. ఇంకా దారుణం ఏంటంటే.. కారు గుర్తుపై గెలుపొందిన కొత్త కార్పొరేటర్లను సైతం టీఆర్ఎస్ దారుణంగా అవమానపరుస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. అసలు ఇప్పుడు కార్పొరేటర్లుగా ఉన్నది కొత్తగా గెలిచినవాళ్లా? లేక ఓడిపోయినవాళ్లా? నిస్సిగ్గుగా ఓడిపోయిన కార్పొరేటర్లతో సిటీలోని పలు పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వాటికి సోయి తప్పిన మంత్రులు కూడా హాజరవుతున్నారు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను అసలే పిలవడంలేదు. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గుంట నక్కలు.. రాక్షసులుగా దోపిడీ దొంగల్లా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీపై సమీక్ష ఎందుకు చేయడంలేదు? ఇన్నిరోజులు దోచుకున్నది సరిపోలేదా? మిగిలున్న పనుల్లో లిస్టు ప్రకారం దోపిడీకి పాల్పడుతున్నారు. అవి దోచుకునేదాకా కొత్త కార్యవర్గానికి అవకాశం కల్పించబోమని ఒక గిరి గీసినట్లు వ్యవహరిస్తున్నారు.

ఆకుల రమేశ్ ఆఖరి కోరిక..
ప్రభుత్వం తీరు చూసి గ్రేటర్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. తమ సమస్యలపై మాట్లాడుతారని కొత్త కార్పొరేటర్లను గెలిపిస్తే, వాళ్లతో ప్రమాణాలు కూడా చేయించకపోవడాన్ని చీదరించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కొత్తగా ఎన్నికైన లింగోజిగూడెం కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ కనీసం ప్రమాణస్వీకారం చేయకుండానే కన్నుమూశారు. ఆయన చనిపోయే ముందు డాక్టర్లను వేడుకున్నాడు.. ప్రజలు నన్ను నిజాయితీగా గెలిపించినందుకు వాళ్లకు సేవచేయాలని ఆశపడుతున్నట్లు ఆకుల చివరిమాటగా చెప్పినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రమాణస్వీకారం దాకానైనా బతకాలని కోరుకున్నాడు. ఆ మరణ పాపం టీఆర్ఎస్ పార్టీకే తగులుతుంది.

గత ఈసీ సారీ చెప్పాడు.. ఈయనైతే దాసోహం..
ఎన్నికల కమిషన్ కు అసలు సోయే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రేమో రాక్షస ముఖ్యమంత్రిగా, మానవ మృగంగా మారిపోయాడు. టీఆర్ఎస్ ను బీజేపీ దీటుగా ఎదురించిన జీహెచ్ఎంసీలో కొత్త కౌన్సిల్ ఇంకా ఏర్పాటు చేయకపోవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్ లోకి లాగడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మేం ముందే చెప్పాం.. సీఎం గనుక ఆ పనిచేస్తే మేం మళ్లీ గెలిచితీరుతాం. కోట్ల రూపాలు ఇస్తామని మా వాళ్లకు ఫోన్లు చేస్తున్నారు. ఏ ధీమాతో ముందస్తు ఎన్నికలు పెట్టారో, అంతే దమ్ముంటే మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలి. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలి. మేయర్ ను ఎన్నుకోలేనప్పుడు ముందస్తుగా ఎన్నికలు ఎందుకు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదు. గతంలో తెలంగాణ ఎన్నికల కమిషనర్ కనీసం సారీ అయినా చెప్పాడు. ఇప్పుడున్న కమిషనర్ అయితే కేసీఆర్ కు దాసోహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. వీటిపైనే మేం గవర్నర్ కు ఫిర్యాదు చేశాం.

టచ్లో 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమంటున్నారు. కానీ అది అప్రజాస్వామిక విధానం కాబట్టి ఆ ప్రపోజల్ ను మేం పక్కనపెట్టేశాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతానని ప్రకటించిన సంగతిపై ఆయనను అడిగిన తర్వాతే చెబుతాను. ఏది ఏమైనా మా లైన్ చాలా క్లియర్ గా ఉంది. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది. టీఆర్ఎస్ పార్టీని జనమే గద్దె దించుతారు. ఇక కేసీఆర్ విషయానికొస్తే..

పాత ప్రొఫెషన్లోకి కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పటికైనా కొన్ని విషయాల్లోనైనా కనువిప్పు కలగడం మంచి విషయం. అయితే, ఇన్నేళ్లు కేంద్ర పథకాలపై ఎందుకు కాలయాపన చేశాడు? అప్పుడు తప్పు అన్నవి ఇప్పుడు ఒప్పు ఎందుకయ్యాయి? వాటిలో ఏం మంచిని గుర్తించి, అంగీకరించాడో కేసీఆరే సమాధానం చెప్పాలి. కరోనా సమయంలో తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు కాకపోవడం వల్ల పేదలు ప్రాణాలు కోల్పోయారు. మధ్యతరగతి, మిగతా వార్గాల వాళ్లు కరోనా చికిత్స కోసం ఆస్తులను తెగనమ్ముకున్నారు. వాళ్లందరికీ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. కొవిడ్ మరణాలకు బాధ్యత తనదేనని ఒప్పుకోవాలి. యూటర్న్ సీఎం కేసీఆర్ జీవితం చివరికి మళ్లీ ఆరంభదశకు చేరుకోనుంది. కేసీఆర్ తిరిగి పాస్ పోర్ట్ బ్రోకర్ స్థాయికే చేరబోతున్నారు'' అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications