కారణమిదే: ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఆశోక్పై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారనే కేసులో హెచ్ఎండిఏ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఆశోక్ సహకరించినట్టు ఆరోపణలు వెలువడడంతో ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు ఆశోక్పై సస్పెన్షన్ వేటు వేశారు.
హైద్రాబాద్లోని హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పురుషోత్తం రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలోనే పురుషోత్తం రెడ్డి తన ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు.
అయితే ఈ కేసు విచారణ సమయంలోనే పురుషోత్తంరెడ్డికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనే అనుమానాలను కూడ అప్పట్లోనే ఏసీబీ అధికారులు వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఈ కేసు విషయంలో ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఆశోక్ కుమార్ పురుషోత్తంరెడ్డికి సహకరించినట్టుగా అభియోగాలు నమోదయ్యాయి.
ఈ అభియోగాలపై ఆశోక్కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
పురుషోత్తం రెడ్డి అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలున్నాయి. అనుమతుల విషయంలో హెచ్ఎండిఏకు వచ్చే వారి నుండి పురుషోత్తం రెడ్డి మధ్య దళారులతో డబ్బులు వసూలు చేయించేవారని ఏసీబీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు.
వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఈ ఫిబ్రవరిలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో తొలుత పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఫిబ్రవరి 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా చంచల్ గూడ జైలుకు తరలించారు.పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టగా హెచ్ఎండీఏ అధికారి పురుషోత్తం రెడ్డి అక్రమాలు, అవినీతికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్కుమార్ సహకరించారని తేలింది.