మరో కుంభకోణం: 40కోట్ల విలువైన భూమిని అక్రమంగా కట్టబెట్టారు, కోట్లలో రిజిస్ట్రార్ ఆస్తులు
మియాపూర్ గోల్డ్ స్టోన్ భూ స్కాం తరహాలోనే మహేశ్వరంలో మరో భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: మియాపూర్ గోల్డ్ స్టోన్ భూ స్కాం తరహాలోనే మహేశ్వరంలో మరో భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.
నాగోల్లో ఆయన ఇంటితోపాటు బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేస్తున్నారు. సరూర్ నగర్, కొత్తపేట, ఉప్పల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

కాగా, గురువారం రోజు రమేష్ చంద్రారెడ్డి బ్యాంకు లాకర్లను కూడా తెరిచారు ఏసీబీ అధికారులు. రూ. 30లక్షల డిపాజిట్లు, 8లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ తోపాటు మూడున్నర కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భువనగిరిలో 4.36 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. సోదాలు పూర్తయిన తర్వాత అన్ని వివరాలు మీడియాకు చెబుతామని ఏసీబీ అధికారుతులు తెలిపారు.
కాగా, రమేష్ చంద్రారెడ్డి విచారణలో మరో భూ కుంభకోణం వెలుగుచూసింది. మహేశ్వరం మండలం రావిలాలలో ఓ సొసైటీకి చెందిన 4.5ఎకరాల భూమిని అనిల్ అనే వ్యక్తికి రమేష్ చంద్రారెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది. దీంతో పోలీసులు అనిల్ను కూడా అరెస్ట్ చేశారు.
రూ.40కోట్ల విలువైన భూమిని కేవలం రూ.5కోట్లకే కట్టబెట్టారని విచారణలో తేలింది. మూడేళ్ల క్రితమే(2015) ఈ వ్యవహారం జరిగినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బడా నేతలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications