ఓటుకు నోటు: లోకేష్ తర్వాత 'బాస్'పై తేల్చేందుకు..? ఎఫ్ఎస్ఎల్ కీలకం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో 'బాస్'పై తెలంగాణ ఎసిబి దృష్టి సారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు పాత్ర పైన నిగ్గు తేల్చేందుకు కసరత్తు చేస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితులకు పలువురు ఏపీ నేతలు, పోలీసు అధికారులు ఆశ్రయమిచ్చినట్లుగా తెలుస్తోందని చెబుతున్నారు.
ఒకటి రెండు రోజుల్లో వారికి నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఎసిబి అధికారులు 'బాస్'పై దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ టిడిపి లోకేష్ పాత్ర పైన దృష్టి సారించిందని, తదుపరి చంద్రబాబు పైన ఫోకస్ చేసిందని చెబుతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడినట్లుగా వీడియో వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఇప్పటికే తొలి ఛార్జీషీటులో ఎసిబి ప్రస్తావించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిమ్మిబాబు, లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి తదితరులకు నోటీసులు ఇచ్చింది.
సండ్ర కొద్ది రోజుల క్రితం ఎసిబి ఎదుట హాజరయ్యారు. జిమ్మిబాబు, కొండల్ రెడ్డిలు ఇంకా హాజరు కాలేదు. నోటీసులు ఇచ్చినప్పటికీ వారు హాజరు కాకపోవడంతో.. వారికి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశముంది. వీడియోలో రేవంత్ రెడ్డి పలుమార్లు 'బాస్'ను ప్రస్తావించారు.
ఆ బాస్ స్టీఫెన్ సన్తో నేరుగా ఫోన్లో కూడా మాట్లాడారని చెబుతున్నారు. ఇప్పటికే ఎసిబి అధికారులు రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, సండ్రల వాయిస్ శాంపిల్స్ సేకరించారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చనుంది. అవి ఎవరియో ఎఫ్ఎస్ఎల్ చెప్పాక తెలంగాణ ఎసిబి దూకుడు పెంచనుంది.