పొరుగునే కేసీఆర్ కు తొలిపరీక్ష-ఏపీ పార్టీల్లో వ్యతిరేకత మొదలు-విజయవాడ సభ తర్వాతే క్లారిటీ !
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై పోరులో భాగంగా ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితికి ఏపీలో ప్రస్తుతానికి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. హైదరాబాద్ లో కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మారుస్తూ సంతకం చేయగానే విజయవాడలో దీనికి అనుకూలంగా బ్యానర్లు దర్శనమిచ్చాయి. తాజాగా అమలాపురంలోనూ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీల్లో మాత్రం సానుకూలత వ్యక్తం కావడం లేదు. దీంతో జాతీయ పార్టీగా ఎదగాలని భావిస్తున్న కేసీఆర్ కు పొరుగున ఉన్న ఏపీలోనే తొలి పరీక్ష ఎదురుకాబోతున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకంపనలు
నిన్న మొన్నటివరకూ కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే సంకేతాలు రాగానే అదంత సులువు కాదని,కేసీఆర్ జాతీయ పార్టీ కష్టమేనని చెవులు కొరుక్కున్నవారంతా ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చేందుకు సిద్దమవుతున్న వేళ దీనిపై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జాతీయ స్ధాయిలో బీఆర్ఎస్ ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఈ యజ్ఞాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు, అక్కడ ఆయనకు ఎదురయ్యే సవాళ్లేమిటన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీంతో కేసీఆర్ తదుపరి అడుగులపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఏపీలో బీఆర్ఎస్ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఏపీలో బీఆర్ఎస్ పరీక్ష
ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. ఇప్పుడు కేసీఆర్ కూ ఇదే వర్తించేలా ఉంది. తెలుగు రాష్ట్రం, అందులోనూ తెలంగాణకు మాతృ రాష్ట్రమైన ఏపీలో సత్తా చాటుకున్న తర్వాతే మిగతా రాష్ట్రాలకు కేసీఆర్ వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏపీపైనే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ దృష్టిపెడుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలు, నేతలతో ఉన్న సంబంధాలను వాడుకుని విస్తరించాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ కేబినెట్లో మంత్రులైన తలసాని, పువ్వాడ అజయ్ వంటి వారికి ఏపీలోని నేతలతో సంబంధాలు ఉన్నాయి. వీరితో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలకూ బంధాలున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటూ బీఆఎర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నించాల్సి ఉంది. అయితే ఇక్కడే కేసీఆర్ కు సవాల్ ఎదురుకానుంది.
బీఆర్ఎస్ పై ఏపీ పార్టీల్లో వ్యతిరేకత
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఏపీకి చెందిన అధికార, విపక్ష పార్టీల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అన్నింటికంటే మించి బీఆర్ఎస్ రాకతో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వెంటనే దీనిపై స్పందించేందుకు వారు ఇష్టపడటం లేదు. వైసీపీ నేత సజ్జల వంటి వారు ఏ కొత్త రాజకీయ పార్టీ అయినా స్వాగతిస్తామని చెబుతున్నా అంతర్గతంగా వైసీపీలోనూ భయం ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ వంటి విపక్ష పార్టీల్లోనూ అదే పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు వీరందరి దృష్టీ విజయవాడలో త్వరలో కేసీఆర్ నిర్వహిస్తారని భావిస్తున్న బహిరంగసభపైనే ఉంది.
విజయవాడ సభతో క్లారిటీ
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఎంట్రీగా భావిస్తున్న విజయవాడ బహిరంగసభ ఇప్పుడు ఆయనకే కాదు ఏపీలోని రాజకీయ పార్టీలకూ కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా విజయవాడకు వచ్చే కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ అవసరంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కీలకం. అంతే కాదు ఏపీలో రాజకీయ పార్టీల మద్దతు కోరతారా లేక తానే బీఆర్ఎస్ ను ఒంటరిగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారా అన్నది కూడా విజయవాడ సభలోనే క్లారిటీ ఇచ్చే అవకాశముంది. దీంతో విజయవాడ సభలో కేసీఆర్ చేసే వ్యాఖ్యల ఆధారంగానే భవిష్యత్తులో ఆయనతో తమ రాజకీయం డిసైడ్ చేసుకోవాలని వైసీపీ, టీడీపీతో పాటు మిగతా పార్టీలు కూడా భావిస్తున్నాయి.